పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!!
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. శనివారం నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
పొద్దున ఎండ.. సాయంత్రం వాన రాష్ట్రంలో పొద్దునంతా తీవ్రంగా ఎండలు కొడుతుండగా సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ నగరం సహా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.
నిజామాబాద్, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వేల్తూరులో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. కాగా, ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 40.9 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలో 40.6, కామారెడ్డి 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


