హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ను విలన్లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భారాస రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తప్పుబట్టారు.
అసెంబ్లీకి రానివాడివి. నువ్వేం నాయకుడివి ?: మంత్రి సీతక్క
కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. అసెంబ్లీకి రానివాడివి. నువ్వేం నాయకుడివంటూ కేసీఆర్పై మండిపడ్డారు. అసెంబ్లీ సొల్లు కబుర్లు అయితే మీ బచ్చగాళ్లని ఎందుకు పంపుతున్నావంటూ నిలదీశారు. రాష్ట్రం ఆగమైందని కేసీఆర్ అంటున్నాడు.. నియంత వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు..చెరువులు,వాగులు,ప్రభుత్వ కాలువలు మూసేసి కేసీఆర్ సభ పెట్టాడంటూ ఎద్దేవా చేశారు. రూ. 60 వేల కోట్ల కరెంట్ బకాయిలు పెట్టాడంటూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ అని అన్నారు.
పోలీసులను సైతం కేసీఆర్ బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్ అంత నీచంగా పోలీసులను ఎవరు అవమాన పరచలేదన్నారు. ఫాం హౌజ్ దగ్గర పోలీసులను కాపలా పెట్టిన వ్యక్తి కేసీఆర్.. అధికారం పోయిందనే అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. అధికారం పోయిందనే బాధ తప్పా ప్రజలపై కేసీఆర్కి ప్రేమ లేదన్నారు. రజతోత్సవ సభలో పార్టీ విజయాలు మాట్లాడతారా? ప్రభుత్వంపై దుమ్ము పోస్తారా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకి ఉచిత బస్సు ఇస్తే దానిపై విమర్శలా? చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఉచిత బస్సు వాడుకోవడం వల్ల నెలకి ప్రతి మహిళలకు దాదాపు రూ. 4 వేలు మిగులుతున్నాయన్నారు.