- ఎన్ని కుట్రలు పన్నినా సభ విజయవంతమైంది..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని, కేసీఆర్ వొచ్చి నిలదీస్తాడని అనగానే ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. అందుకే అడుగు అడుగున పోలీసు ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించింది దుర్మార్గ సర్కారు. సభా స్థలికి కార్యకర్తలు చేరకుండా 10,15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్ సహా అన్ని దారుల్లో వచ్చే వాహనాలను ఎక్కడికికక్కడ అడ్డుకున్నారు. ట్రాఫిక్ జాం పేరిట సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపారు.
ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి వొచ్చే దాదాపు1000 పైగా వాహనాలను హుస్నాబాద్ దాటిన తర్వాత కొత్తపల్లి నుంచి యూ టర్న్ చేసి తిరిగి సిద్ధిపేట వైపు మళ్ళించారు. ఆర్టీవో అధికారులను అడుగడుగునా పెట్టి వాహనాలు చెక్ చేయించారు. స్కూల్ బస్సులు అద్దెకు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. బిఆర్ఎస్ సభను ఎలాగైనా అడ్డుకోవాలని దుష్టపన్నాగాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది, సహాయ నిరాకరణ చేసి సభను ఫెయిల్ చేసే కుట్ర చేసింది.
సభకు వచ్చే అన్ని రహదారులను దిగ్బంధం చేసి సంకుచిత బుద్ధిని మరోసారి కాంగ్రెస్ బయట పెట్టుకున్నది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారు. తండోపతండాలుగా తరలివచ్చి గులాబీ జెండా సత్తా చాటారు. ఇది ఆరంభం మాత్రమేనని హరీష్ రావు అన్నారు. ప్రజలను నమ్మించి నయవంచన చేసిన మీ మోసపూరిత వైఖరికి చరమగీతం పాడే సభను విజయవంతం చేసిన బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, టీవీల్లో లక్షల సంఖ్యలో వీక్షించిన తెలంగాణ బిడ్డలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.