- వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కృషి
- హరితవిప్లవం, ఉపాధి హామీ, రైతు రుణమాఫీ కాంగ్రెస్ చలువే..
- దేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం తగ్గుతోంది..
- కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మహాసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రైతులు మన ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం ఆయన కేరళ రాష్ట్రం కోజీకోడ్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులు, కార్మికుల మహాసభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో వ్యవసాయం ఒక జీవన విధానమని అన్నారు. అలాంటి వ్యవసాయ రంగం నేడు అకాల వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, మారిన వాతావరణ ప్రభావం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని వివరించారు. భారతదేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం క్రమంగా తగ్గుతోందన్నారు. 2016లో 17.5% కాగా ప్రస్తుతం అది 14% గా నమోదయింది. అయినప్పటికీ సగం జనాభా వ్యవసాయ రంగంతోనే ముడి వేసుకుని ఉన్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో మనం చరిత్రను చూసి నేర్చుకోవాలి. స్వాతంత్రం అనంతరం కాంగ్రెస్ వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి పని చేసిందన్నారు. ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతల సారథ్యంలో హరిత విప్లవాన్ని సహకారం చేశారని, అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలు, మెరుగైన నీటిపారుదల వ్యవస్థ, ఎరువులు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ చర్యల మూలంగా ధాన్యం ఉత్పత్తి 55 మిలియన్ టన్నుల నుంచి 1978- 79 నాటికి 131 మిలియన్ టన్నులకు పెరిగింది, ఈ పరిణామం కేవలం వ్యవసాయం వృద్ధికే కాదు కాదు గ్రామీణ ఉపాధిని ఆర్థిక శక్తిని బలోపేతం చేసిందని అన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కాంగ్రెస్ విజయం వేసింది, 1965 లో లాల్ బహుదూర్ శాస్త్రి మద్దతు వ్యవసాయ ధరల కమిషన్ ను స్థాపించారు. ఇందిరా, రాజీవ్ గాంధీ ల కాలంలో వ్యవసాయ ధరల కమిషన్ ను మరింత బలోపేతం చేశారని తెలిపారు.
రైతులను స్వతంత్రులను చేసేందుకు రుణమాఫీ అవసరం అన్నారు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం 71,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది, దీని ద్వారా దేశంలో 3.68 కోట్ల మంది రైతులకు ఉపశమనం కలిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆశీర్వాదంతోనే ఏర్పడింది అన్నారు. ఇప్పటివరకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం, రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 12,000 పెట్టుబడి మద్దతుగా అందిస్తున్నాం, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, సన్నధాన్యం సాగుచేసిన రైతులకు క్వింటాలుకు 500 బోనస్, 10,547 కోట్ల విలువైన పంటల సేకరణ వంటి చర్యలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్టు వివరించారు.
సమాజాన్ని నడిపించేది అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులే అన్నారు. తక్కువ వేతనాలు, రక్షణ లేని పరిస్థితులు వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల కాలం నుంచి కాంగ్రెస్ కార్మికుల హక్కుల కోసం పోరాడిందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16,19, 23, 24, 39, 41, 42, 43, 43 ఏ, 54 కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేరణతోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈజీఎస్ పథకం ప్రతి గ్రామస్తునికి 100 రోజుల ఉపాధి హామీని కల్పించిందని అన్నారు. ప్రపంచంలోనే ఇది ప్రథమ నిబంధన, ఈ పథకం గ్రామీణుల వేతనాలు పెంచింది, వలసలను తగ్గించింది, వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించిందని తెలిపారు.
ఆత్మీయ రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఎకరానికి 12,000 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని వివరించారు. గిగ్ వర్కర్ల హక్కులను గుర్తించి, వారికి ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కల్పించే విధానాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు.
ప్రతి రైతు అభివృద్ధి ప్రయాణంలో మనం భాగస్వామి కావాలని, ఈ కార్మికుడు ఒంటరిగా ఉండకూడదు, కర్షకుడిని రక్షించండి, కార్మికుడిని కాపాడండి అనే నినాదం ఈ సదస్సుకు ఒక కొత్త దిక్సూచి కావాలి అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు రైతు, కార్మికుల వెంట నడిచింది, గాంధీజీ స్వరాజ్య పిలుపు నుంచి కేరళ భూ సంస్కరణల వరకు ఇది స్పష్టం అయ్యింది అన్నారు. గౌరవం అనేది ఒకరు ఇచ్చేది కాదు అది అందరికీ లభించాల్సిన హక్కు అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఆంటోని జోసఫ్ ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, డిసిసి అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.