ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా
చిరంజీవి, పలువురు కేంద్రమంత్రులు, నేతల రాక
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ వేడుకల్లో స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు, సినీనటుడు చిరంజీవి, ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, పీవీ సింధు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మోదీ వీక్షించారు. గాయని సునీత పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వెంకటేశ్వరస్వామి ప్రతిమను కిషన్రెడ్డి అందజేశారు. ఎంపీలు లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, లక్ష్మణ్, గోడెం నగేష్, బాలశౌరి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి , డికె.అరుణ సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలు సైతం వేడుకలో పాల్గొన్నారు. అలాగే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతి రాధిత్య సింధియా, మనోహర్ లాల్ కట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, సతీశ్ చంద్ర దూబే, శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. మరోవైపు పలువురు ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు.
కేంద్ర మంత్రి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి, చిరంజీవి, పెమ్మసాని చంద్రశేఖర్ సాదర స్వాగతం పలికారు. సంక్రాంతి వేడుకల నేపథ్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంటిని ముస్తాబు చేశారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.