కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం

దానినే విస్మరించిన గత ప్రభుత్వం
డిఎస్సీని అడ్డుకునేందుకు అనేక యత్నాలు
ఎల్బీ స్టేడియం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9:‌కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగిందని.. అయినా, గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్య తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. దశాబ్ద కాలం డీఎస్సీ గురించి ఆలోచన చేయలేదని ఆక్షేపించారు. పేదలకు నాణ్యమైన విద్య అందించా లనే తపనతోనే టీచర్‌ ‌పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామన్నారు. ప్రతిపక్షం డీఎస్సీపై ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అనుకున్న సమయానికి డీఎస్సీ పక్రియను పూర్తి చేశామన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో భట్టి మాట్లాడారు.  ఏళ్ల తరబడి పదోన్నతులు, బదిలీల్లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు. మా ప్రభుత్వం రాగానే టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేసింది.

డీఎస్సీపై ప్రతిపక్షం చాలా కుటిల ప్రయత్నాలు చేసింది. అయినా.. డీఎస్సీ పక్రియ ఆగలేదని అన్నారు.మరోవైపు, రాష్ట్రంలో 10వేల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ ఏడాది పిబ్రవరిలో 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేవలం ఏడు నెలల్లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను  రేవంత్‌ ‌సర్కార్‌ ‌పూర్తి చేసింది. డీఎస్సీ పరీక్షలకు 2.46లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. బ్యాక్‌లాగ్‌ ‌పోస్టులు మిగిలిపోకుండా మొత్తం ప్రక్రియను  ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 2,515 స్కూల్‌ అసిస్టెంట్లు, 685 భాషా పండితులు, 6277 ఎస్‌జీటీ, 145 పీఈటీ, 103 స్పెషల్‌ ఎడ్యుకేటర్ల పోస్టులు, 281 ఎస్జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ‌పోస్టులను భర్తీ చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌ ‌జిల్లా నుంచి 761మంది, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లా నుంచి 82 మంది నియామక పత్రాలు అందుకోనున్నారు. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో 1056 పోస్టుల భర్తీ ప్రక్రియ  పెండింగ్‌లో ఉందని వివరించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హా మేరకు అమలు చేస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *