కుటుంబ సమేతంగా వొచ్చిన రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి15 : ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు దిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు ఉంటారు. అనంతరం గురువారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళతారు. సింగపూర్కు చేరుకున్న తర్వాత రేవంత్ బృందం శుక్రవారం అక్కడ జరిగే బిజినెస్ మీట్లో పాల్గొంటారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.





