తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చట్టం అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యా శాఖ మంత్రి బాధ్యతను తానే నిర్వహిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని పలు మార్లు పలు సమావేశాలలో మాట్లాడడం ఒక మంచి పరిణామం. అంతే కాకుండా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడం ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గం లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయమే. కానీ అతి ముఖ్యమైన విద్యాహక్కు చట్టాన్ని అమలు పరుస్తామని ఎక్కడా కూడా మాట్లాడినట్లు కనిపించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాము లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం ధ్యేయంగా వచ్చిన పలు చట్టాలలో విద్యా హక్కు చట్టం అతి ప్రధానమైనదని ముఖ్యమంత్రి గారికి తెలియాలి.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాల సంబరాలను దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం అభినందనీయమే. సంబరాల కన్నా రాజ్యాంగ విలువలను కట్టుబడి ఉంటామనే హామీలు ఇవ్వడం ముఖ్యం.ఈ సందర్భంగా దేశం లోని బాలలందరికి సమాన నాణ్యమైన విద్య ను అందిస్తామని ప్రభుత్వాలు శపథం చేయాలి. విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న విద్యా వివక్షతను రూపుమాపాలి.రాజ్యాంగం కల్పించిన బాలలకు ఉచిత నాణ్యమైన విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి.
2009 సంవత్సరంలో బాలల విద్య కు సంబంధించి చట్ట రూపం దాల్చి ఆదేశిక సూత్రాల జాబితా నుండి ప్రాథమిక హక్కుగా రూపొందింది. దేశంలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీలు ఈ చట్టానికి మద్దతు పలికాయి. 2002 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో 83 వ రాజ్యాంగ సవరణ చేసి జీవించే హక్కు తో పాటు బాలలకు విద్యనందించేందుకు రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 a ను పొందుపరిచి తగు చట్టం చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని కొనసాగింపు గా 2009 సంవత్సరంలో యుపిఎ ప్రభుత్వం శాసనంగా మారిన తీరు గమనిస్తే అన్నీ పార్టీలు బాలల విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చాలనే రాజకీయ సంకల్పం అర్థమవుతుంది. ఈ చట్టం ద్వారా కోట్ల మంది అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నట్లు అయ్యింది. అన్నీ చట్టాల లాగానే పేద వర్గాల కు సంబంధించిన ఏ చట్టమైన అమలు తీరు చాలా బలహీనం అనే విషయం తెలిసిందే. బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కూడా అమలులో పలు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చట్టం అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి విద్యా శాఖ మంత్రి బాధ్యతను తానే నిర్వహిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని పలు మార్లు పలు సమావేశాలలో మాట్లాడడం ఒక మంచి పరిణామం. అంతే కాకుండా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడం ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గం లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయమే. కానీ అతి ముఖ్యమైన విద్యాహక్కు చట్టాన్ని అమలు పరుస్తామని ఎక్కడా కూడా మాట్లాడినట్లు కనిపించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాము లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం ధ్యేయంగా వచ్చిన పలు చట్టాలలో విద్యా హక్కు చట్టం అతి ప్రధానమైనదని ముఖ్యమంత్రి గారికి తెలియాలి. అంతకు ముందు ప్రభుత్వం చట్టం ఊసే తీయలేదు. విచిత్రం ఏమిటంటే ఈ కొత్త ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచడం అటుంచి ఈ సంవత్సర కాలం లో చట్ట ఉల్లంఘనలకు పాలు పడడం బాధాకరం. అట్టి ఉల్లంఘనలు ఒక్కొకటిగా పరిశీలిద్దాం.
ప్రైవేటు పాఠశాలలో పేద వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య: సెక్షన్ 12(1)(c ) ఉల్లంఘన: పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలకు ఒకటవ తరగతిలోని విద్యార్థుల సంఖ్య 25 శాతం ఇచ్చి ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే వరకు ఉచిత విద్యను ప్రైవేటు పాఠశాలలు అందించాలి. గత ప్రభుత్వం చట్టంలో పేర్కొన్న ఈ అంశాన్ని అమలు చేయడం కుదరదని అసెంబ్లీ సాక్షి గా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ఈ ప్రభుత్వం దీని మీద ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేదు. దీనికి సంబంధించి ప్రజా ప్రయోజనాల వాజ్యం తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో నడుస్తుంది.
పాఠశాల యాజమాన్య కమిటీ ల స్థానం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు : సెక్షన్ 21 (1) చట్ట ఉల్లంఘననే: విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పిల్లల తల్లిదండ్రుల తో ఉపాధ్యాయులు మరియు స్థానిక విద్య ప్రేమికులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. పాఠశాల యాజమాన్య కమిటీల(ఎస్.ఎం.సి.) స్థానంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసి చట్టప్రకారం స్కూల్ యాజమాన్య కమిటీలను విస్మరించడం ద్వారా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించారు.
స్థానిక ప్రభుత్వాల పాత్ర : సెక్షన్ 9 ఉల్లంఘన: స్థానిక ప్రభుత్వాలకు విద్యా హక్కు ద్వారా రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన అధికారాలను విస్మరించారు. విద్యారంగాన్ని పటిష్టం చేయాలంటే స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని పెంచడానికి అనుగుణంగా విధానాలు రూపొందించి నిధులు సమకూర్చి, ఒక పటిష్టమైన వ్యూహాత్మకమైన, నమ్మకంతో కూడిన రాజకీయ సంకల్పం కలిగించాలి. పాఠశాలల అభివృద్ది నిర్వహణ లో స్థానిక ప్రభుత్వాల పాత్ర ను నామమాత్రం చేశారు. కేరళ రాష్ట్రం ఈ పద్దతి చాలా కాలంగా కొనసాగుతుంది. ఆ రాష్ట్రం విద్యా రంగంలో ముందు ఉండడానికి ఈ విధానం కూడా ఒక బలమైన కారణం.
విద్యేతర పనులకు టీచర్లను పంపటం పై నిషేధం: సెక్షన్ 27 ఉల్లంఘన : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం దాదాపు 40 వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించడానికి రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్య వలన దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు బోధన నుండి దూరం అవుతున్నారు. ఉపాధ్యాయులకు జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ విధులు మరియు పార్లమెంట్, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులు మినహాయించి టీచర్లను ఏ ఇతర విద్యేతర పనులకు పంపకూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించుటకు జారీ చేసిన ఉత్తర్వులు విద్యా హక్కు చట్టం సెక్షన్ 27 ప్రకారం చట్ట ఉల్లంఘన కిందికి వస్తుంది.
నాణ్యమైన విద్య అందించక పోవడం: సెక్షన్ 29(2)h ఉల్లంఘన: నాణ్యమైన విద్య అందించడంలో రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. దేశవ్యాప తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (NAS) నివేదిక ప్రకారం మన రాష్ట్రం దేశం లో ఉన్న 36 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల లో 35 వ స్థానం లో నిలిచింది. ఎస్ సి, బి సి, ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఇంకా ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నాయి. నాణ్యమైన విద్య ను అందించక పోవడం చట్టం లోని సెక్షన్ 29(2) h ప్రకారం ఉల్లంఘననే.
టీచర్ల సర్దుబాటు సింగల్ టీచర్ : సెక్షన్ 19(1) మరియు షెడ్యూల్ బడికి నియమాలు ప్రామాణికాలు: విద్యా హక్కు లో భాగంగా పాఠశాల నియమాలు ప్రమాణికాలను నిర్దేశించింది. ఒకటి నుండి అయిదవ తరగతి వరకు 60 మంది విద్యార్థుల వరకు కనీసం ఇద్దరు టీచర్లు తప్పని సరి అని చట్టం చెబుతుంది. విద్యా శాఖ ఉత్తర్వుల ప్రకారం పది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఒక టీచర్ తో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విద్యా హక్కు చట్ట ఉల్లంఘననే.. వాస్తవానికి ఆవాసం లో ఉన్న పిల్లల జనాభాను బట్టి పాఠశాలలను టీచర్లను నియమించాలి. అప్పుడు విద్యార్థులు పెరుగుతారు. ప్రస్తుతం పాటించే విధానం తో ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది.
గురుకుల పాఠశాలలో ప్రవేశ్య పరీక్ష: సెక్షన్ 13 ప్రకారం ఉల్లంఘన: విద్యా హక్కు చట్టం సెక్షన్ 13 ప్రకారం బాలలకు ఎటువంటి ఎంపిక విధానానికి గురి చేయ కూడదు. చట్ట విరుద్దంగా గురుకుల పాఠశాలలు ఐదవ తరగతి ప్రవేశాలకు నాలుగవ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష మరియు 100 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు. ఇది విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘన గా నే పరిగణించాలి. చట్టం లో కేవలం కేంద్రీయ, నవోదయ మరియు సైనిక విద్యాలయాలుకు మాత్రమే మినహాయింపు ఉంది.
పిల్లల్ని నిరక్షరాస్యత వాతావరణం నుండి దళిత బహుజనుల పిల్లలకు చదువెందుకు అనే భావ జాలాన్ని ఎదుర్కోవడానికి బడి వాతావరణానికి తీసుకురావడానికి వచ్చిన పాఠశాలలు ఇవి. మొదటి తరం చదువుకు కదిలిన పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలు సింగిల్ పేరెంట్, నిర్లక్ష్యానికి గురి అయిన పిల్లలకు,వలస కార్మికుల పిల్లలకు బాలకార్మికుల నుండి విముక్తి అయిన పిల్లలకు ఇవి ఇప్పటికి అవసరమే. ఇటువంటి నేపథ్యం ఉన్న పిల్లలకే గురుకులాలు నిర్వహించాలి. ముఖ్యమైన విషయం ఈ గురుకుల పాఠశాలలు కొత్తగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలు రాష్ట్రం లో ఉన్న దాదాపు 60 లక్షల మంది పిల్లలందరికి విద్యను అందించే సామర్ధ్యం కలిగి ఉండవని గుర్తించాలి. అవాసాలలో ఉండే పాఠశాలలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. కేవలం 4 లక్షల 26 వేల మంది విద్యార్థులకు మాత్రమే విద్యను అందించ గలుగు తున్నాము. ఇంకో 2 లక్షల 57 వేల మంది విద్యార్థులు కేజీబీవీ,మోడల్ స్కూల్,రెసిడెన్సియల్ స్కూల్స్ లో చదువుతున్నారు.
అదేవిధంగా విద్యా హక్కు చట్టం లోని పట్టణాలలో విద్యను అందుబాటులోకి తేవడం , ప్రత్యేక అవసరాల పిల్లల పై శ్రద్ద , ప్రైవేట్ పాఠశాలలు నియంత్రణ ,మౌలిక వసతులు కల్పన, సరిపడా నిధులు కేటాయింపు మొదలగు అంశాల పై దిశ నిర్దేశం చేసింది విద్యా హక్కు చట్టం. డిసెంబర్ మొదటి వారం లో జరిగే ‘ ప్రజా పాలన విజయోత్సవాల’లో భాగంగా ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారి హాయం లో తెచ్చిన విద్యా హక్కు చట్టాన్నిఅమలు పరుస్తామని హామీ ఇస్తారని ఆశిద్దాం.
చివరగా ప్రభుత్వమే వివిధ రకాలైన పాఠశాలను ఏర్పాటు చేయడం అలాగే వివిధ రకాలైన ప్రైవేటు విద్యా వ్యవస్థలకు అనుమతిలిస్తూ సమాజం లో ఉన్నఅసమానతలకు అద్దం పట్టే విధంగా విద్యా విధానాలు ఉంటున్నాయి. పేద వర్గాలకు చెందిన శ్రామిక ప్రజల పిల్లలకు గ్రామ స్థాయిలో బస్తీలలో ఉన్న ప్రభుత్వ బడులు మెరిట్ మరియు ప్రవేశ పరీక్షల పేరుతో గురుకులాలు,ఇంటిగ్రేటెడ్ గురుకులాలు నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక విద్యాలయాలు ప్రభుత్వాలే నిర్వహించడం సరి అయిన విధానం కాదు. దేశంలోని బాలలందరికి రాజ్యాంగం నిర్దేశించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మరియు ఇతర స్వాతంత్ర్య సమరయోధులు ఆశించిన నాణ్యమైన సమాన విద్య ను అందించిన నాడే 26 జనవరిని నిజమైన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని గుర్తించాలి.
-ఆర్.వెంకట్ రెడ్డి.
జాతీయ కన్వీనర్, ఎం.వి. ఫౌండేషన్
Mobile:9949865516.





