కేంద్ర బడ్జెట్‌ ‌లో వివక్షపై వెల్లువెత్తిన నిరసనలు

  • రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆందోళనలు
  • బీజేపీ ఎంపీలు, మంత్రుల రాజీనామాకు డిమాండ్‌
  • తెలంగాణ కేంద్ర మంత్రులు చవటలు.. దద్దమ్మలని వ్యాఖ్య
  • జనగామలో  ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్‌
‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్‌ ‌లో  తెలంగాణపై వివక్ష చూపారంటూ కాంగ్రెస్‌ ‌నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపట్టారు. ఏఐసిసి, టిపీసిసి ఆదేశాల మేరకు  బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌విగ్రహం ముందు ధర్నా చేపట్టి వినతిపత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో బాగంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ ‌కూడలి వద్ద నిరసన కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్‌ ‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిరసన చేపట్టారు. అంబేద్కర్‌ ‌విగ్రహానికి ఎమ్మెల్యే కడియం పూల మాలలు వేసి నివాళులర్పించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాటాలను గౌరవించి, అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏనాడూ తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి కేటాయించలేదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో మోదీ ప్రధానిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వొచ్చేది కాదన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగామాట్లాడారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్వయంగా ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి అనేకసార్లు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని, విభజన హామీలను పరిష్కరించడం లేదని అన్నారు. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి వేల కోట్ల నిధులు కేటాయించి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్రం అంటే అన్ని రాష్ట్రాల కలయిక అని, దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకుండా వివక్ష చూపడం దుర్మార్గమని మండిపడ్డారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రానికి అనేక విధాలా బడ్జెట్‌ ‌కేటాయించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.
image.png
జనగామలో …
తెలంగాణలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, స్టీల్‌ ‌ఫ్యాక్టరీ, రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు, సెంట్రల్‌ ‌యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటి వంటి అనేక విజ్ఞప్తులు చేసిన ఏ ఒక్కటీ పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో లేదా, తెలంగాణ ప్రజలు పన్నులు కట్టడం లేదా…. దేశంలోనే అత్యధిక జీడిపి, అత్యధిక జీఎస్టి అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. అయిన తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజలకు తెలిపేందుకే ఈరోజు కాంగ్రెస్‌ ‌పార్టీ రోడ్డు ఎక్కిందని అన్నారు.
తెలంగాణ బిజెపి ఎంపీలు నరేంద్ర మోదీకి గంగిరెద్దుల్లాగా తల ఊపడం తప్పితే తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని అన్నారు. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు చవటలు, దద్దమ్మలు అని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌కి తెలంగాణ పై ప్రేమ ఉంటే, తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. నిజంగా మీకు తెలంగాణ పౌరుషం ఉంటే తెలంగాణకు నిధులకు తీసుకురావాలి లేదంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు.   దేశమంటే మట్టి కాదోయ్‌ ‌దేశమంటే మనుషులోయ్‌ అని బడ్జెట్‌ ‌ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌తెలంగాణ రాష్ట్రం దేశంలో లేదా, తెలంగాణ తెలంగాణలో ఉన్నది మనుషులు కాదా అని ప్రశ్నించారు.
కనీసం సర్పంచ్‌ ‌కూడా కాకుండా దొడ్డి దారిన కేంద్ర ఆర్థిక మంత్రి అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఎలా తెలుస్తాయని దుయ్యబట్టారు. బిజెపి మొదటి నుంచి తెలంగాణపై వ్యతిరేకత చూపుతూ, రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ ‌ని అవమానించేలా వ్యవహరిస్తోందని అన్నారు. ఇలాంటి మతతత్వ పార్టీ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ బిజెపి ఎంపీలు నరేంద్ర మోదీ దగ్గర మోకరిల్లకుండా తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని లేకపోతే వెంటనే మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page