- ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ వెల్లడిరచిన చేదునిజం
- విచ్చలవిడిగా అవసరం లేని మందుల విక్రయం
మన ఆధునిక జీవన రీతిలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య విశ్లేషకులు చెపుతున్న మాట. ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు. ‘అల్లోపతి’ వైద్యవిధానంలోని మందులు, మందులిస్తున్న వైద్యులు మనుషులలో రోగ నిరోధకశక్తి తగ్గిపోవడానికి దోహదం చేస్తుండడం దశాబ్దాల వైపరీత్యం. ఈ వైపరీత్యం మన జీవన విధానంలో నిహితమైంది. అవసరం లేని మందులను అమ్ముతున్నారు. అవసరం లేకుండానే ‘వ్యాధి భ్రాంతి’కి గురైనవారు ఆ మందులను కొని తింటున్నారు. శరీరంలో సహజంగా సంభవించే వివిధ రకాల అసౌకర్యాలు కొన్ని గంటలలో లేదా కొన్ని రోజులలో అంతే సహజంగా తొలగిపోతాయి.
కానీ అంతవరకు ఓపిక పట్టలేని జనం వైద్యుల- అల్లోపతి డాక్టర్ల- వద్దకు పరుగులు తీస్తారు. ఈ వైద్యులు కొంతమంది ఎలాంటి మందులివ్వకుండానే ఈ ‘వ్యాధిభ్రాంతి’ని తొలగిస్తున్నారు. కానీ సమాజహితకరులైన, నిజాయితీపరులైన వైద్యుల సంఖ్య ‘అల్లోపతి’ వైద్య రంగంలో తక్కువ. ఎక్కువ మంది వైద్యులు అనవసరమైన పరీక్షలను జరిపిస్తున్నారు, అనవసరమైన మందులను ‘వ్యాధిభ్రాంతి’కి గురి అయిన వారి శరీరాలలోకి ఎక్కిస్తున్నారు. క్రమంగా ఈ మందుల ప్రభావం పెరుగుతోంది. ఎన్ని మందులు మింగినప్పటికీ ‘వ్యాధి’ నయం కాని స్థితి ఏర్పడుతోంది. ‘రోగ నిరోధక శక్తిని పెంచే’ యాంటీ బయాటిక్ మందులను ‘గోలీ’ మాత్రల రూపంలోను, ‘గొట్టాల’రూపం లోను, సూది మందు రూపంలోను వ్యాధిగ్రస్తుల శరీరంలోకి ఎక్కించడం వల్ల ‘రోగి’ శరీరం ఈ మందులను ప్రతిఘటించే స్థితికి చేరుతోందన్నది ‘ఆరోగ్య సంస్థ’వారి నివేదికలో వెల్లడైన వాస్తవం. అంతేకాక ‘వ్యాధి’కి ఎలాంటి ‘మందు’నివ్వాలన్న నిర్ధారణలో పొరపాట్లు జరిగినట్టయితే కూడ ఆ ‘మందు’వల్ల రోగ నిరోధకశక్తి సన్నగిల్లిపోతుందట! దీనివల్ల ‘క్షయ’, రోగ నిరోధక వ్యవస్థ పనిచేయకపోవడం ఎయిడ్స్ , మూత్ర నాళిక కాలుష్యం, మలేరియా వంటి జబ్బులు మందులకు లొంగని స్థితి ఏర్పడుతోందట. అందువల్ల ‘యాంటీ బయాటిక్’ మందులను ఆచితూచి వాడాలని, నిర్ధారణ చేయడంలో మరింత జాగ్రత్త వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు హెచ్చరించారు. మన దేశంలో అమ్ముడవుతున్న మందులలో ఎక్కువ భాగం ఈ యాంటీ బయాటిక్ తరగతికి చెందినవి. వీటి వాడకాన్ని తగ్గించాలన్నది ‘సంస్థ’వారి మార్గదర్శకం..
ఆధునిక జీవన ‘విలాసం’ ఫ్యాషన్ పేరుతో, జీవన ‘రీతి’ స్టయిల్ పేరుతో జరిగిపోతున్న అనేక అనర్థాలలో ఈ విచక్షణ రాహిత్యమైన ‘మందుల మింగుడు’ ఒకటి మాత్రమే! క్రిమిసంహారపు ఔషధాలను విరివిగా వాడడం వల్ల కూడ ప్రకృతి, పరిసరాలు వ్యాధిగ్రస్తం అవుతున్నాయి. ఫలితంగా మానవులు చిత్రవిచిత్ర వ్యాధులకు గురి అవుతున్నారు. ‘మెదడు వాపు’ ఎన్సిఫలిటిస్.. ఇలాంటి విచిత్ర, భయంకర వ్యాధులలో ఒకటి. ఇప్పుడు బిహార్లోని ముజఫర్పూర్ ప్రాంతంలో ‘ఉద్ధృతమైన మెదడువాపు లక్షణం అక్యూట్ ఎన్సిఫలిటిస్సిస్ సిన్డ్రోమ్ ఏఈఎస్ విస్తరించింది. ఈ వ్యాధికి గురి అయిన నూట యాబయి మంది చిన్నపిల్లలు అకాల మృత్యువు పాలయ్యారు. ఇప్పటికీ అనేక మంది వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, బిహార్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక చికిత్సను కొనసాగిస్తున్నాయన్నది ప్రచారంలోని ఒక అంశం. ఉభయ ప్రభుత్వాలూ చతికిలపడి ఉన్నాయని, చిన్నారుల బతుకులు ‘మొగ్గలు’గానే రాలిపోవడానికి ఈ ఘోర వైఫల్యం కారణమని మరో ప్రచారం జరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం వారు కేంద్ర ప్రభుత్వాన్ని, బిహార్ ప్రభుత్వాన్ని ‘సంజాయిషీ’కోరడానికి ఇదీ నేపథ్యం. ప్రభుత్వాలు సంజాయిషీలు ఇచ్చుకుంటాయి. కానీ ఈ ప్రక్రియ వల్ల మరణించిన శిశువులు మళ్లీ బతికిరారు. విలయం ముంచుకొని వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొనడం దశాబ్దాల తరబడి నడచిపోతున్న చరిత్ర. కానీ ‘విలయం’ ముంచుకొని రావడానికి మన సమష్టి సమాజ జీవన పద్ధతులు కారణమన్న వాస్తవాన్ని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకొనడం లేదు. శాస్తవ్రేత్తలు, విశ్లేషకులు పట్టించుకోవడం లేదు.
ధ్యాస లేని జనం రోగాలను కలిగించగల జీవన పద్ధతులను విడనాడడం లేదు..! నగరాలలోను పట్టణాలలోను అధికాధిక శాతం విద్యావంతులు, ఉద్యోగులు, ఇతర ప్రముఖులు, శిష్టులు, విశిష్టులు తమ ఇళ్లలో భోజనాలు చేయడం మానేస్తుండడం ‘రోగ’కారకమైన ఫ్యాషన్ లో అతి ప్రధానమైనది. వీరు ఇళ్లలో వంటలు చేయడం లేదు. కర్రీ పాయింట్ సాధకాల విక్రయశాలలలోను, ఫాస్ట్ఫుడ్ సెంటర్- వేగవంతంగా భోజనాలను తయారుచేసే కేంద్రంలలోను, ఇతరేతర రకరకాల ‘వాణిజ్య భోజనశాల’ల్లోను, దుకాణాలలోను వీరు భోజనాలను ముప్పూటలా కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ‘అంతర్జాలం’ సాలెగూడులా అల్లుకున్న తరువాత ఇళ్లకే భోజనాలు వచ్చిపడుతున్నాయి.
శుచి .. హైజెనిక్ కరమైన వాతావరణంలో ఈ అంగడి తిండిని వండడం లేదు. ముడి పదార్థాలు.. పాలు పెరుగు నెయ్యి నూనె కూరగాయలు వంటివి భయంకరంగా కల్తీ అవుతున్నాయి. రసాయన విషాలను ఉపయోగించి అన్నిరకాల తినుబండారాలను ఆకర్షణీయమైన రంగులతో దిద్దుతున్నారు. రుచి, వాసనలు, తాజాతనం కూడ రసాయన విషాల వల్లనే సమకూడుతున్నాయి. పురుగుల మందులు.. క్రిమిసంహారక ఔషధాలు కేవలం పొలాలలోని పంటలపై పిచ్చికారీ చేయడం లేదు. ఈ రసాయనాలు, రసాయనపుటెరువులను పానీయాలలోను, ఆహారాలలోను కలపుతున్నారట! ‘కోకో’, ‘పెప్సీ’వంటి ప్రముఖ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ పానీయాలలో ఈ రసాయన విషాలు కలిసి ‘రుచి’ని పుట్టిస్తున్నట్టు ఏళ్లతరబడి ప్రచారమౌతోంది. దేశమంతటా ‘ఎముకల’ నుంచి ఇతర వ్యర్థాల నుంచి ‘స్వచ్ఛమైన నూనె’ ‘నెయ్యి’, ‘పాలు’ తయారవుతుండడం బహిరంగ రహస్యం.
ఇవన్నీ ఏయే భోజనాల అంగళ్లద్వారా ఎంతమంది పొట్టలలోకి చేరుతున్నాయన్నది ‘బ్రహ్మదేవుడు’ సైతం కనిపెట్టలేని భయంకర బహిరంగ వైపరీత్యం…. అందువల్ల క్రిమిసంహారక ఔషధాల ఫెస్టిసైడ్స్ వల్ల మెదడువాపు వ్యాధి వ్యాపించిందా? అన్న మీమాంస ఇప్పుడు జరగడం కేవలం పునరావృత్తి! అంగడి తిండి విపరీతంగా తినడం వల్లనే పాతికేళ్లలోపు యువజనులకు సైతం పెద్దపెద్ద బొబ్బలు ఏర్పడుతున్నాయి. వారి నడుములు వంగవు, ఒకే భంగిమ.. పోశ్చర్ లో ఈ యువజనులు పదిహేను నిముషాలు కూడ కూర్చోలేరు, కాళ్లు చాపుకోవాలి.. రైలుపెట్టెలలో ఒక బల్లపై కూలబడిన వారు ఎదురుగా ఉన్న ‘బల్ల’పై కాళ్లుపెట్టుకొని సాగిలపడడం పరాకాష్ఠ.. ఉదయం సూర్యుని కంటె ముందు నిద్రలేవడం వల్ల డెబ్బయి ఐదు శాతం జబ్బులు రావు.
కనీస వ్యాయామం, కొంత దూరం నడవడం, అంగడి తిండి తినకపోవడం, శీతల పానీయాలను తాగకపోవడం, ముక్కులకు మూతులకు ‘బురద’ను అంటించుకున్నట్టు ‘చాక్లెట్ల’ను తినకపోవడం వంటివి రోగాలను నిరోధించగల జీవన విలాసంలో భాగం. ‘.. ఒకవైపున పెందలాడే చంపడానికి ప్రయత్నం, ఇంకో వైపున బతికించడానికి ప్రయత్నం, కొత్తకొత్త వ్యాధులను నివారించడానికి చేసే ప్రయత్నం బ్రహ్మాండంగా ఉంది కదా! కొత్తకొత్త వ్యాధులను పుట్టించేందుకు డాల్డా ఉంది, వైట్ ఆయిల్ ఉంది..!!’ మందులకు లొంగని విచిత్రమైన ‘బూజు కాలుష్యం’- ఫంగల్ ఇన్ఫెక్షన్- ప్రపంచమంతటా వ్యాపిస్తోందన్నది వెల్లడైన కొత్త సమాచారం!
-సమీర్





