భారతదేశం సువిశాలమైన భూభాగం కలిగి ఉన్న వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి జనాభా సుమారు 70 శాతం వరకు వ్యవసాయం, దాని అను•ంధ రంగాలపైనే జీవనం సాగుతుంది. ఈ దేశంలోని అన్నదాతలు 80 శాతానికిపైగా సన్న, చిన్నకారు రైతులే. వీరి సేద్యపు నేల 5 ఎకరాల లోపే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల• జూన్- జులై నెలల్లోనే వ్యవసాయ పంటల సాగుకు పూనుకుంటారు. నైరుతి రుతుపవనాలు ఈ సమయంలో దేశమంతటా విస్తరించి, దేశంలో 80 శాతం వర్షపాతం కురుస్తుంది. తెలంగాణలో తొలకరి, ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లులు కురుస్తున్న వేళా పంట పొలం ఎదురుచూస్తుంది. రైతు దుక్కి, దున్నాలని.. ఆ తరువాత అదనులో విత్తనాలు నాటి పాడి పంటలు పండించి జీవుల ఆకలి తీర్చాలని మట్టినే నమ్ముకున్న అన్నదాతలు ఆరాటపడుతుంటారు. వ్యవసాయంలో దిగుబడులు అధికంగా రావడానికి ప్రధానంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కీలక పాత్ర వహిస్తాయి. శాస్త్ర సాంకేతికంగా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వలన నూతన వంగడాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తయారీలోకి వచ్చాయి. వీటిని ఉత్పత్తి చేయడంలో ప్రైవేట్ సంస్థలు ప్రవేశించాయి. స్వార్థ ధనార్జనే ధ్యేయంగా రాష్ట్రంలో దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వ్యాపార సంస్థలు, నకిలీ(కల్తీ)వాటిని తయారు చేసి ఈ సీజన్లో అమ్ముకుంటూ ఆరుగాలం కష్టం చేసే అన్న దాతల నోట మట్టికొట్టుచున్నారు. అధిక దిగుబడి కాదు కదా ! పెట్టిన పెట్టుబడి రాకపోగా రేయిం•వళ్లు కుటుంబం మొత్తం శ్రమించిన శ్రమంతా ‘‘బూడిదలో పోసిన పన్నీరుగా’’ మారుతుంది. ఇలా మన రాష్ట్రంతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని నకిలీ దందా కొనసాగుతుంది. నియంత్రించే యంత్రాంగ కొరతకు తోడు లంచాలు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్ల మూలంగా కల్తీ వ్యాపారం ‘‘మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలుగా’’ కొనసాగుతుంది. ఇలా ప్రతీ ఏటా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కల్తీ నాసిరకం కంపెనీల క•ంధహాస్తాల్లో చైతన్యం, అవగాహన లేని మూలంగా అన్నదాతలు నష్టపోయి ఆత్మ హత్యల పాలౌతున్నారు. ప్రభుత్వాలు ఆ వేళ ఆర్భాట ప్రకటనలతో కాలం వెల్లదీస్తున్నాయి.
సంక్షోభానికి బీజం: గత మూడు దశాబ్ధాల నాడు సరళీకృత, ఆర్థిక సంస్కరణ విధానాలు, గ్లోబలైజేషన్ వ్యాపార విధానాలతో ప్రపంచంలోని చాలా వ్యాపార వాణిజ్య సంస్థలు మన దేశంలోకి ప్రవేశించాయి. పెట్టుబడిదారి, కార్పొరేటు వ్యాపారంలో లాభార్జనే ధ్యేయంగా వేరే దేశాల్లో నిషేధించిన మందులను మనదేశంలో విక్రయిస్తూ ఆ విషపూరిత రసాయనాల వల్ల భూసారం క్షీణించి పోతుంది. భూమి కలుషితమైపోతుంది. వాతావరణం, పర్యావరణం విషపూరితమైపోతుంది. ఇలా అన్నదాతల నోట మట్టికొడుతూ నేలమ్మ కడుపులో విషం పంపుతున్నారు. తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నామనే సోయిలేక ధనార్జన మాయలోపడి గుర్తించలేకపోతున్నారు. ప్రభుత్వాలు ప్రతి ఏటా మోసాలను చూస్తూనే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. అందువల్ల వారి వ్యాపారాలకు అడ్డు అదుపు లేకుండా కొనసాగుచున్నాయి. ఇలా నాసిరకం (నకిలీ) విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు మనదేశంలో సుమారు 30 శాతం ఉన్నట్లు ఓ అంచనాల్లో తేలింది. పంటలకు ఆశించిన తెగుళ్లను నాశనం చేస్తామంటూ, అధిక దిగుబడిని ఇస్తాయి అంటూ పురుగు మందులు (బయో పెస్టిసైడ్స్) జీవన ఎరువులు (బయో ఫెర్టిలైజర్స్)లలో నాణ్యత లేనట్లు తెలుస్తుంది. వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఒక ప్రయోగశాల కూడా లేనట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3,300/- కంపెనీల పేర్లతో పలురకాల జీవన ఎరువులు, పురుగు మందులు అనేక రకాల బ్రాండ్లతో అమ్ముచున్నారు. వీటిలో చాలా వాటికి తయారీ ప్లాంట్లు, పరిశోధన కేంద్రాలు, ఇతర మౌళిక సదుపాయాలు లేవని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. వీటిలో 355 కంపెనీలు మాత్రమే రిజిష్ట్రేషన్ (నమోదు)కు దరఖాస్తు చేశాయి. ఈ కంపెనీలు గత మూడేళ్ళలో ఎన్ని మందులు అమ్మారు. ఏయే ఉత్పత్తి ఎంత తయారు చేశారు. అనే వివరాలు కొన్ని సంస్థలు ఇవ్వడం లేదు. ఇస్తే జీఎస్టి కట్టాల్సి ఉంటుంది. కావున ఇలా పలు కంపెనీలు జీఎస్టీ కట్టడం లేదు. అంటే వాటికి ఉండాల్సిన అన్ని అర్హతలు సక్రమంగా లేవని తెలుస్తుంది. ఇలాంటి వాటిలో తయారైన మందుల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంతకాలం జీవన పురుగు మందులు, ఎరువులు అమ్మే వ్యాపారులు, కంపెనీలపై నియంత్రణ చట్టం లేదు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీలు అమ్మే ఉత్పత్తుల వివరాల్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి ‘‘ఫారం జీ2’’ పొందాలని కేంద్ర గెజిట్ నోటిఫికేషన్లో ఆదేశించింది. దీన్ని కలిగి ఉన్న కంపెనీలు రెండేళ్ల పాటు వారి ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ లోగా వారి ఉత్పత్తులలోని జీవన పదార్థాల వివరాలను వ్యవసాయ విశ్వ విద్యాలయానికి తెలపాలి. వీరు వాటిని పరీక్షించి శాస్త్రీయంగా ఉంటే ఉన్నట్లు ఆమోదించాల్సి ఉంటుంది. వర్సిటీ ధృవీకరణతో ప్రతి కంపెనీ కేంద్ర పురుగు మందుల నియంత్రణ మండలి (సీఐబీ) నుండి శాశ్వత అనుమతులు పొందాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇచ్చే ‘‘ఫారం జీ2’’ జారీ చేసేముందే వాటి చిరునామా, ప్లాంట్ల వివరాలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేశారా లేదా అని లోతుగా తనిఖీ చేయాలి. ఇందులో సిబ్బంది అవినీతికి పాల్పడితే అన్నదాతలక• భారీగా అన్యాయం జరుగుతుంది. వీటిపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ప్రభుత్వాలు, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఈ దేశానికి ‘‘పట్టెడు అన్నం పెట్టే’’ అన్న దాతల జీవితాలపై మరియు జాతి జనుల ఆరోగ్యంపై ఆధారపడ్డ అంశమని మరువరాదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్లో విచ్ఛల విడిగా నాసిరకం (నకిలీ) జీవన ఎరువులు, పురగు మందులు, విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకొని కట్టడి చేయాలి. ఇలా నిర్జీవ ఎరువులను, విత్తనాలను, పురుగు మందులను అమ్మే కంపెనీలపై కేసులు పెడుతూ వారి విష కౌగిలినుండి అన్నదాతలను రక్షించాలి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం : రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వలన వివిధ రంగాలతో పాటు వ్యవసాయ రంగంపై కూడా పడింది ఎరువుల ధరలు అనూహ్యంగా పెరగటంతో పాటు తీవ్రమైన కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన పోటాష్, నత్రజని వంటి పదార్థాల కోసం మన దేశం ఉక్రెయిన్, రష్యా, బెలారస్ దేశాలపై ఆధారపడటమే ఇందుకు కారణం. అమ్మోనియా, నైట్రోజన్, నైట్రేట్స్, ఫాస్ఫెట్స్, పొటాష్, సల్పేట్ ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. ఈ పరిణామంతో దేశీయ కంపెనీలు కూడా పెంచడం ఖాయం. ఇప్పటికే ఎరువుల రిటైల్ ధరలు పెరిగాయి. పొటాష్ ధర మొన్నటి వరకు బస్తా రూ।। 1050/- ఉండగా, ఇప్పుడు రూ।। 1700/-లకు ఎగబాకింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు 50 నుంచి 70 శాతం వరక• పెరిగాయి. బస్తా కాంప్లెక్స్ ఎరువు ధర రూ।। 1400 నుంచి 1900గా చెబుతున్నారు. మున్ముందు సరఫరా తగ్గుతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ యుద్ధం ఎలా ఉన్నా ఏడాది పాటు ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందనిపిస్తుంది. కృత్రిమ కొరత సృష్టించి ఇబ్బందుల పాలు చేస్తారని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వాల కర్తవ్యం : జూన్లో వానాకాలం (ఖరీఫ్) పంటల సాగుబడి ప్రారంభం కానుంది. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అన్నదాతల పెట్టుబడి వ్యయంపై అధిక భారం పడకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలి. అన్నదాతలు ఆరుగాలం కుటుంబం మొత్తం కష్టపడినా లాభం లేదని నిరాశలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వేళ ‘‘మూల్గే నక్కపై తాటిపండు’’లా ఎరువుల ధరలు పెరగడం, కల్తీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, అతివృష్టి, అనావృష్టులు వెంటాడుతున్నాయి. పాలకులు ధరలను సరళతరం చేస్తూ, కొరత లేకుండా నిల్వలను చేసుకుని సకాలంలో అందించాలి. డెబ్బై అయిదేళ్ళ స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్నదాతల ఆత్మహత్యల దయనీయ స్థితిని నివారిస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ, రాష్ట్రాల పాలకులపై ముమ్మాటికి ఉన్నదని మరువరాదు. అన్నదాతల భద్రతంటే భారతజాతి ఆహార భద్రత అనేది కాదనలేని నిజం. అన్నదాతలు సుఖంగా ఉంటేనే దేశమంతా సుఖంగా ఉన్నట్లు.
అన్న‘‘దాత’’ల జీవితమంటే ఇవ్వడమే.. మనకు ‘‘మెతుకు’’ ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు. జనం జవసత్వాలతో బతకడానికి తన ప్రాణాన్ని ఫణంగా పెడుతున్నాడు. కావున వ్యవ‘‘సాయం’’ దండుగ కాదు, పండుగ అనుకునేలా వ్యవసాయ రం(రైతాం)గానికి పాలకులు దన్నుగా నిలవాలి. అప్పుడే యువత ఈ రంగం వైపు మల్లుతారు కాదు కూడదంటే చేసేవారుండరు.
రైతులు విత్తనం నాటిన నాటినుండి పంట అమ్ముకుని డబ్బులు చేతికి వచ్చే వరకు ఏ దశలోను దోపిడికి గురికాకుండా చూడాలి.
రుణ మాఫీతోపాటు పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు, ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు, పరికరాలు అందించాలి.
పండించిన ‘‘పంటకు గిట్టుబాటు ధరను’’ కల్పించాలి. సాగునీరు, ఉచిత కరెంట్, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలి.
అన్నదాతలకు పాలనలో ఎమ్.ఎల్.సి., ఎమ్.పి.లుగా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.
జాతీయ నమూనా సర్వే ప్రకారం రైతు ఆదాయం రోజు (దినసరి) కూలి కన్నా తక్కువ రూ।। 224 అని తేలింది. ఈ దుర్భర స్థితిని నిర్మూలించాల్సిన కనీస బాధ్యతను విస్మరించరాదు.
మేకిరి దామోదర్, వరంగల్ సెల్: 9573666650