తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్ పూర్తయ్యింది…ఇక కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవిఎలంను స్ట్రాంగ్ రూమ్లకు పంపి పటిష్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వొస్తాయని ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. గ్రామాల్లో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ కొన్ని సర్వే సంస్థలు హంగ్ ను అంచనా వేస్తున్నాయి. హంగ్ రావాలని కూడా కొందరు కోరుకుంటున్నారు. మంత్రి కెటిఆర్ కూడా ఈ సర్వేలను కొట్టి పారేశారు. తుదివిజయం తమదేనని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకే ఫలితాలు ఎలా వొస్తే ఎలా స్పందించాలన్న దానిపై ముందు గానే అన్ని రాజకీయ పార్టీలు ప్రణాళికలు చేసుకుంటాయి. అదీ తేడా కొడితే ఏం చేయాలన్న దానిపై ప్లాన్ చేసుకున్నాయి. ఎన్నికల కౌంటింగ్ తర్వాత హంగ్ వొస్తే.. ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం లేదు. ఓ రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ రెండు పార్టీలు ఏమిటన్నది ఇప్పుడు కీలకం. బీఆర్ఎస్ పార్టీ ఏ జాతీయ పార్టీతో కలుస్తుందన్నదే చర్చనీయాంశం. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కలవవు. బీఆర్ఎస్తో ఓ జాతీయ పార్టీ మాత్రమే కలవాల్సి ఉంటుంది. బిజెపిలో కూడా హంగ్ వొస్తుందన్న ఆశలు ఉన్నాయి. హంగ్ వొస్తే తమదే విజయం అన్న ధీమాలో బిఆర్ఎస్ ఉంది. ఎన్నికలకు ముందు నుంచే బిజెపి, బిఆర్ఎస్, ఐఎఐఎం అవగాహనతో ఉన్నాయన్న ప్రచారం ఉంది.
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ రావాలంటే 60 అసెంబ్లీ స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉంది. ఆ పార్టీకి 60 సీట్ల అక్కర్లేదు. 50 సీట్లు వొచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఎందుకంటే.. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్కు ఏకపక్షంగా మద్దతు పలుకుతుంది. అలాగే బిజెపి కూడా పరోక్ష లేదా ప్రత్యక్ష మద్దతుగా సిద్దంగా ఉంది.రెండు పార్టీల మధ్య ఆ అవగాహన ఉంటుంది. ఎలా చూసినా మజ్లిస్కు ఆరు నుంచి ఏడు స్థానాలు ఖాయం. నాంపల్లి సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. అక్కడ ఫలితం తారుమారైతే ఆరు స్థానాలు ఖాయం. బీఆర్ఎస్కు తగ్గే సీట్లు ఈ వీటితో సరిపోతే పంచాయతీనే ఉండదు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో మరోసారి అధికారానికి దూరం అవుతాయి. అంటే హంగ్ వొస్తే బీఆర్ఎస్ ` మజ్లిస్ కలిసేందుకు మొదటి చాయిస్ ఉంది. మొదటికి బీఆర్ఎస్ కనీసం 50 సీట్లు సాధించాల్సి ఉంటుంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు ఇన్ని స్థానాలు ఇవ్వడం లేదు. మజ్లిస్ మద్దతు కూడా సరిపోనంత తక్కువగా బీఆర్ఎస్కు సీట్లు వొస్తే.. ఆ పార్టీకి అధికారంలోకి వొచ్చే అవకాశం లేదు. ఒకవేళ బిఆర్ఎస్కు 45 సీట్లు వొచ్చినా బిజెపికి కనీసం 15 సీట్లు వొస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీలతో చర్చలు జరపడానికి అవకాశం ఉంది. మజ్లిస్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తే.. బీజేపీకి అంత కన్నా ఎక్కువ సీట్లు వొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఆ రెండు పార్టీలు కలిసే చాన్స్ ఉంటుంది ఎందుకంటే.. బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వకుండా ఉండలేదు. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేయడంలో బీజేపీ రాటుదేలిపోయింది.ప్రభుత్వ ఏర్పాటుకు తమపై ఆధారపడే అన్ని సీట్లు సాధించాలని పార్టీ నేతలకు ఎన్నికలకు ముందే దిశానిర్దేశం చేశారని ఇప్పటికే వినిపిస్తోంది. పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించడం కష్టమైన పరిస్థితుల్లో బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేసిందని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల ముందు రాజకీయాలకు.. ఎన్నికల ఫలితాల రాజకీయాలకు సంబంధం ఉండదు. అప్పటి రాజకీయాలు అప్పటివే. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుల్ని ఎవరూ కాదనలేరు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోతే కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది కూడా ప్రశ్నే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్లాన్ ఉందో లేదో స్పష్టత లేదు. అయితే ఇదే పరిస్థితి కాంగ్రెస్కు వొచ్చినా ఎంఐఎం కూడా సిద్దంగా ఉంటుంది. ఎంఐఎం కూడా ఇలాంటి పరిస్థితి రావాలనే కోరుకుంటోంది. గతంలో అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఇలాంటి ప్రకటన చేసిన సందర్భం ఉంది. నిజానికి తెలంగాణ ఎన్నికలు ఇతర పార్టీల కంటే.. కాంగ్రెస్ కు అతి పెద్ద సవాల్. కాంగ్రెస్ మెజార్టీ మార్క్ ను తెచ్చుకుంటే… ఏ సమస్యా ఉండదు. ఓ సారి కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేస్తే.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తారు. గతంలో కేసీఆర్ చూపించిన దారిలోనే వెళ్లవొచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు తెలుపుతుంది. అందులో సందేహం లేదు. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు సీట్లు తగ్గితే కాంగ్రెస్ ఏంచేస్తుందన్నది చర్చగా మారింది. తొలుత బొటాబొటీగా 60 సీట్లు వొచ్చినా కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేయడం ఖాయం. లేకుంటే మజ్లిస్ మద్దతు ఇచ్చేంత సీట్లు రావాలి. ఒక వేళ అధికారంలో భాగం పంచుకోకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెంట ఉంటారని గ్యారెంటీ ఉంటుంది. అప్పుడు బిఆర్ఎస్లో గెలిచినా, బిజెపిలో గెలిచినా గోడదుంకడం ఖాయం. తెలంగాణ ఫలితాల్లో హంగ్ అంటూ వొస్తే అసలు పరీక్ష కాంగ్రెస్ పార్టీకే ఎదురవుతుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నపార్టీకి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పెద్ద సమస్య అవుతుంది. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో పోరాడటం సమస్యగా మారుతుంది. అలాగని బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమే. ఒక వేళ మజ్లిస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలిగిగే సీట్లు తెచ్చుకున్నా… అది ముళ్లబాటే అవుతుంది. అందుకే పూర్తి మెజార్టీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.
`ప్రజాతంత్ర డెస్క్