పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
వనపర్తి, ప్రజాతంత్ర మే 1 : పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్లపూర్, వనపర్తి జిల్లాలోని ఎదుల ఫేజ్ 2 రిజర్వాయర్లను మంత్రి ఉత్తమ్ సందర్శించారు. మధ్యాహ్నం ఎదుల రిజర్వాయర్ వద్ద హెలికాప్టర్ ద్వారా చేరుకోగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్ మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ కలెక్టర్ బి.సంతోష్, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లతో కలిసి ఎదుల రిజర్వాయర్ ఫేజ్ 2 ను పరిశీలించారు. అనంతరం ఎదుల టన్నెల్ ను సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ ఎస్. ఈ విజయ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు మంత్రి పాల్గొన్నారు.