యుద్ధం ..!

కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 27 మంది పర్యాటకులు  మరణించి పది  రోజులు గడిచింది. ఉగ్రవాదులు ఎవరు ..ఎక్కడి నుంచి వొచ్చారు ..స్థానికుల సహాయం తీసుకున్నారా అన్న అనుమానాల పై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర నిఘా వర్గాలు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. ముస్లిం మతోన్మాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయని ..ఉగ్రవాదులకు కేంద్రం పాకిస్థాన్ అన్న అనుమానం కు బలం చేకూరేలా  ఉగ్రవాదులకు తమ దేశంలో ఆశ్రయం, శిక్షణ కల్పిస్తున్నది నిజమేననీ ..అమెరికా, బ్రిటన్ దేశాల ను ప్రసన్నంచేసుకోడానికే గత 3 దశాబ్దాలుగా ఈ కార్యక్రమం జరుగుతుందని  మీడియా కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో  ఆ దేశం సైనికాధికారి ఒకరు మాట్లాడం ధృవీకరించినట్లయింది.
రెండు రోజులుగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ ..ఉగ్రవాద సమూల   నిర్మూలనకు త్రివిధ దళాలకు సంపూర్ణ అధికారాలు ఇస్తూ దేశ సైన్యం సమర్ధత  పై పూర్తి విశ్వాసం ప్రకటించారు. ఈ చర్యలతో పహల్గాం దుర్ఘటనతో చలించిపోయిన దేశ వాసులు పాకిస్థాన్ కు సరైన గుణపాఠం చెప్పాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.” ఎంత కాలం చూస్తూ ఉరుకుంటాం ..” అని ఆవేశపడుతున్నారు. ఇండియా ను బలహీన పరచడానికి  పాకిస్థాన్  గత దశాబ్దాలుగా పరోక్ష యుద్ధం కొనసాగిస్తున్నదనీ ..ఇక సహించేది లేదని చాలా మంది  అభిప్రాయం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్త పై  సైనిక చర్యలకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత-పాక్ సైనికుల మధ్య పరస్పర కాల్పుల  వల్ల ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పెరిగింది. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఆశ్రయముంటున్న స్థావరాలపై  సైనిక దాడులకు భారత్    సిద్ధమవుతోందన్న సంకేతాలు ఉన్నాయి.
 మన దేశం  పరిమిత స్థాయిలో పాకిస్థాన్ పై  సైనిక దాడులకు కూడా దిగితే  అది విస్తృత స్థాయిలో జరిగే ప్రమాదముంది . అణు యుద్ధానికి దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు ఆ  లోపలే యుద్ధ  చర్యలను నియంత్రించగలమన్న ఆలోచన సరియైనది కాదు . ఇది ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతాల్లో ఒకటైన దక్షిణాసియాలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచ్చు. గతంలో ఎన్నోసార్లు ఇరు దేశాలు యుద్ధపు అంచుల దగ్గరకి వొచ్చాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మరింత తీవ్రమైనదిగా మారింది, ఎందుకంటే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన దారులు  అన్నీ మూతపడ్డాయి.
ఇరు దేశాలు మూడు యుద్ధాల్ని ఎదుర్కొన్నప్పటికీ  సింధూ నది జలాల  ఒప్పందాన్ని* భారత్  రద్దు చేయడం అత్యంత తీవ్రమైన చర్య. నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోయినా, పాకిస్తాన్ ఈ చర్యను *“యుద్ధ ప్రకటన”*గా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ తన  ప్రతి చర్యలను ప్రకటించింది. 2019లో జరిగిన భారత వైమానిక దాడి, దానికి జవాబుగా పాకిస్తాన్ ఇచ్చిన  ఒక యుద్ధ విమానం కూల్చివేతను మరిచిపోవొద్దు . అప్పుడు అమెరికా దౌత్య పర చొరవ వల్లే పరిస్థితి పూర్తిగా నియంత్రణ తప్పలేదు .  యుద్ధం తక్షణ ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం అత్యంత ప్రమాదకరం. ఒకసారి ప్రారంభమైన యుద్ధాన్ని ముగించడం చాలా కష్టం. ఎంత శక్తిమంతమైన దేశమైనా—యుద్ధ ఫలితాన్ని నియంత్రించలేదు. ఇటీవలి చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలనుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అతి శక్తివంతమైన దేశాలు ఎదుర్కొన్న ప్రతీకూల అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి.
ఒక అంతర్జాతీయ దౌత్యవేత్త చెప్పినట్లుగా—”యుద్ధం ఎంతకాలం కొనసాగితే, దాన్ని దౌత్య  మార్గంలో పరిష్కరించడం అంతే కష్టం.”యుద్ధ విజయాల భ్రమ వాస్తవానికి అంతులేని దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఇది భారత్-పాకిస్థాన్ సందర్భంలో మరింత ప్రాధాన్యం పొందుతుంది. ఇరు దేశాలు  ఒకరిపై ఒకరు “శిక్షించాలి” అనే నినాదాలే సమస్యల పరిష్కార మార్గాలను మూసేస్తున్నాయి.యుద్ధం ఫలితం ఎన్నడూ ఖచ్చితంగా చెప్పలేం. అనుకోని పరిణామాలు ఎదురవుతాయి . చాలా సందర్భాల్లో యుద్ధాలు విస్తరించి, ఖర్చు పెరిగి, ఎదురుతిరుగలేని స్థితికి చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న దౌత్య సంబంధాల విరమణ, చర్చలకు అడ్డంకి అవుతోంది. కానీ అంతర్జాతీయ మాధ్యమాలను వినియోగించి పరిస్థితిని శాంతియుతంగా మార్చే అవకాశం ఇంకా ఉంది.
Epaper.prajatantranews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page