భద్రతా ‌బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారా?

పహల్గామ్‌ ‌ఘటనపై వ్యాజ్యంపై సుప్రీం ఆగ్రహం
న్యూదిల్లీ, మే1 (ఆర్‌ఎన్‌ఎ) : ‌వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని  దెబ్బతీయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. అందులో సున్నితత్వాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి చర్యలతో మన బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకుంటున్నారా? మీకు కూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని ధర్మాసనం సూచించింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ముష్కరులు జరిపిన పాశవిక దాడితో యావత్‌ ‌దేశం ఉలిక్కి పడింది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడాలని దేశమంతా ఒక్కటైంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్ఠైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని కోర్టు పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించొద్దని, ఉగ్రవాద ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారని ధర్మాసనం వెల్లడించింది. అయితే, ఇతర రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు పిటిషనర్‌ ‌కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లొచ్చని తెలిపింది. కోర్టు సూచనలతో పిటిషనర్‌ ‌తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page