సత్ప్రవర్తన కారణంగా చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన ఖైదీలు
బంధువుల రాకతో సందడిగా చర్లపల్లి జైలు ప్రాంగణం
నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి : జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా
మేడ్చల్ , ప్రజాతంత్ర జూలై 3 : తెలంగాణ వ్యాప్తంగా వివిధ జైళ్ళలో ఉన్న సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు మరియు దీర్ఘకాల జైలు శిక్ష అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్షపై ముందస్తుగా బుధవారం విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని చర్లపల్లి కేంద్రకారాగారం నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా హాజరైనారు. ఈ సందర్భంగా విడుదలవుతున్నటువంటి ఖైదీలందరికి కేంద్రకారాగారం చర్లపల్లి నందు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అకెళ్ళ రాఘవేంద్ర , ప్రముఖ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ జాస్తి రాజేశ్వరి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ మాట్లాడుతూ…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో కొంతమంది ఖైదీల బంధువులు ఖైదీల విడుదల గురించి ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తదనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్ట్ జస్టిస్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని, జైళ్ళ శాఖ వారు రూపొందించిన ఖైదీల జాబితాలోని ప్రతి ఖైదీ కేసు వివరాలను కమిటీ నిశితంగా పరిశీలించి కేంద్ర రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. స్క్రూటినీ కమిటీ ఆమోదించిన ఖైదీల జాబితాను అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు.
తదుపరి ప్రతిపాదనను తెలంగాణ గవర్నర్ కి సమర్పించి ఆమోదం పొందారు. తదనుగుణంగా మొత్తం 213 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది. అందులో 205 మంది జీవిత ఖైదీలు 8 మంది దీర్ఘకాలిక శిక్ష విధించబడినటువంటి ఖైదీలు 35 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్ కి డాక్టర్ సౌమ్యా మిశ్రా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతిపాదనలు ఆమోదించి పంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, హోమ్ సెక్రటరీ జితేందర్ కుమార్కి సౌమ్య మిశ్రా ధన్యవాదాలు తెలియజేశారు.