- ఎపికి అనుకూలంగా నిర్ణయాలు
కృష్ఱా బేసిన్ రైతులకు మరణశాసనం
జగన్తో లాలూచీ రాజకీయాలు
రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటన
మన హక్కులను తాకట్టు పెట్టిన ఘనులు
రాష్ట్ర హక్కులపై కేంద్రంతో కలిసి పోరాడుదాం రండి
ప్రజాస్వామ్యంలో రాచరికానికి తావులేదు
వాహనాల రిజిస్ట్రేషన్ పేరు టిజిగా మార్పు
తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు
గ్రూప్ పరీక్షలకు గరిష్ట వయసు 46కు పెంపు…పరీక్షలు నిర్వహించి తీరుతాం
గద్దర్, అందెశ్రీ సహా ఉద్యమకారులను గత ప్రభుత్వం అవమానం
మాది ప్రజా ప్రభుత్వం..సమస్యలపై మీతో సహా అందరికీ అందుబాటులో..
అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : కృష్ణా జలాల్లో వాటాను వదులుకున్న ఘనత కెసిఆర్దని, ఎపికి అనుకూలంగా కెసిఆర్ నిర్ణయాలు తీసుకున్నారని, కృష్ఱా పరివాహక రైతులకు మరణశాసనం రాశారని, ఇప్పుడేమో డ్రామాలు ఆడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జగన్తో లాలూచీ రాజకీయాలు నడిపిందెవరని ప్రశ్నించారు. రాయల సీమను రతనాల సీమ చేస్తామని ప్రకటన చేసింది నిజం కాదా అని అన్నారు. మన హక్కులను తాకట్టు పెట్టిన ఘనులు వారు కాదా అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షింగా కృష్ణాజలాలపై చేసిన అన్యాయాలు మొదలు అందెశ్రీ, గూడ అంజయ్య, గద్దర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, అమరవీరులకు జరిగిన అవమానాలపై సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ను ఏకి పారేశారు. ప్రజాస్వామ్యం లో రాచరికం ఉండకూడదని భావిస్తు న్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు.
కృష్ణా నదీ జలాలు, ఆ నదిపై ఉన్న ప్రాజెక్టులు క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందన్న వాదనను రేవంత్ రెడ్డి ఖండిరచారు. 2014 నుంచి 23 వరకూ కేఆర్ఎంబీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ వెళ్లారని..తాము ఇంత వరకూ ఏ సమావేశాలకు వెళ్లలేదని అన్నారు. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటున్న మోదీకి వ్యతిరేకంగా దిల్లీకి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. అలా కాకుండా నల్లగొండలో ధర్నా చేస్తామనడం దారుణమని అన్నారు. అలాగే తాము చేస్తున్న పోరాటాలకు కలసి రావాలన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో చేసిందంతా చేసి ఇప్పుడు ఆ నెపాన్ని తమపైకి నెడుతున్నారని మండిపడ్డారు. జగన్కు దావత్ ఇచ్చి డైనింగ్ టేబుల్ విూద పునాదిరాయి వేశారని అన్నారు. రోజా ఇంట్లో విందు చేసి రాయలసీమ అభివృద్దికి పాటుపడతానని సిఎం కెసిఆర్ అనలేదా అని అన్నారు. ఈ హావిూతోనే ఎపి సిఎం జగన్ కృష్ణా ప్రాజెక్టుకు పొక్క పెట్టారని అన్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను కెసిఆర్ పూర్తిగా పణంగా పెట్టారని మండిపడ్డారు. ఇకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలు, బోర్డులపై అందరూ టీజీ అని రాసుకున్నారు. కొందరు యువకులు తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించు కున్నారు. కేంద్రం తమ నోటిఫికేషన్లో టీజీ అని పేర్కొంది. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు గుర్తొచ్చేలా టీఎస్ అని పెట్టింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించామని అన్నారు.
రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయి. తెలంగాణ తల్లి అంటే..మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి. మన ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు. తెలంగాణ తల్లి అంటే గడీలో ఉండే మహిళ కాదు.. శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి. అందెశ్రీ అనే కవి తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారు. జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చింది. రాష్ట్రం వొచ్చాక జయజయహే రాష్ట్ర గీతం అవుతుందని అందరూ ఆశించారు. కానీ, ఆ పాటను నిషేధించినంత పని చేశారు. అందుకే అందెశ్రీ గీతాన్ని రాష్ట్రగీతంగా చేస్తున్నామని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటుంది. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ప్రధాన విపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం సభకు శోభనీయం కాదు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. పరిస్థితిని చక్కదిద్దుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. మంచి పనులను అభినందించే సద్బుద్ధి విపక్ష నేతలకు లేదని సీఎం విమర్శించారు. కొట్లాడి తెచ్చుకన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వొచ్చి సలహాలు సూచనలు ఇచ్చి ఉంటే బాగుండేదని సీఎం అన్నారు. సభకు రాకపోవడం అసెంబ్లీ మర్యాదను అవమానించినట్లే అన్నారు. ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా సరైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రాచరిక పోకడలు పోవాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని తీసుకొచ్చింది. మా సర్కార్ సంక్షేమ పధకాలు అమలు చేసి సరిగ్గా రెండు నెలలు.. ప్రతిపక్ష నేతలు అప్పుడే విమర్శలు మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రాంతమే కాదు.. ఒక ఎమోషన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణ వొచ్చిందన్నారు. పోరాటంలో అడుగడుగునా ఉద్వేగపూరితమైన సంఘటనలే కనిపిస్తాయన్నారు. అనేక మంది ఉద్యమకారులు, విద్యార్థులు సొంత రాష్ట్రం తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 60 యేళ్ల సుదీర్ఘ పోరాటంలో కన్న కలలు నిజం చేసుకోవాలన్న ఆశతో తమ జీవితంలో వెలుగు వొస్తుందని ప్రజలు ఆకాంక్షించారన్నారు. అయితే తొమ్మిదిన్నరేళ్లలో అవి నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారని, ఈ మధ్య ఆయన ఆటోలు ఎక్కి డ్రామాలు మొదలుపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పరోక్షంగా మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఉండగా..ఆటో వారిని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోతున్నామని ఎవరైనా ఆటోను తగలబెట్టుకుంటారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. రైతులకు రైతు బంధు పడలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018`19 యాసంగి రైతుబంధు వేయడానికి 5 నెలల సమయం తీసుకున్నారని గుర్తుచేశారు. 2019`20లో రైతు బంధు వేయడానికి 9 నెలలు పట్టిందని పేర్కొన్నారు. 2020`21లో రైతు బంధు వేయడానికి 4 నెలలు పట్టిందని, 2021`22లో 4 నెలలు తీసుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకుండానే రైతుబంధు ఇవ్వలేదని రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో రైతు బంధు వేస్తామని చెప్పినం.. అయినాసరే రైతుబంధు వేయలేదని రైతులను రెచ్చగొడుతున్నారు సీఎం తెలిపారు.జయజయహే గీతం తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పాట రాష్ట్ర గీతం అవుతుందని అంతా భావించినా.. ఆ పాటను నిషేధించినంత పని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక ఆ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించాం. తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి.’ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల ప్రక్షాళన ఆలస్యమైందని..నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని సిఎం అన్నారు.