- ధరణిని వద్దన్నోళ్లనే బంగాళాఖాత•ంలో విసరేయాలి
- అమ్మపేరు…బొమ్మ పేరు చెప్పి దళితులను మోసం
- సింగరేణిని ముంచింది..తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెసే
- చెన్నూరులో చెల్లని వారు బెల్లంపల్లిలో చెల్లుతారా
- బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్పై సిఎం కెసిఆర్ ఫైర్
బెల్లంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 8 : పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నరని, గాంధీభవన్ దగ్గర గేట్లకు తాళాలు వేసి ఆందోళన చేస్తున్నరని సిఎం కెసిఆర్ ఎద్దేవా చేశారు. ఇయ్యాల టికెట్లు అమ్ముకునేటోనికి రాష్ట్రాన్ని అప్పజెప్తె రేపు రాష్ట్రాన్ని అమ్మడా..అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పార్టీ టికెట్లు అమ్మేటోళ్లు ఎంత గొప్పోళ్లు అన్నట్టు..ఇసుంటి గొప్పోళ్లు మనకు కావాల్నా..లేక ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా..అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజల దీవెన ఉంటే తెలంగాణను ఈ దేశంలో నంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కేసీఆర్ సెటైర్లు వేశారు.
చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతదా..అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రజల సంక్షేమాన్ని, రైతుల క్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ధరణిని బంగాళాఖాతంలో ఎయ్యాలె అంటున్నరని, రైతుబంధు దుబారా అని మాట్లాడుతున్నరని, నిజంగానే ధరణిని బంగాళాఖాతంలో ఎయ్యాల్నా..? రైతుబంధు దుబారనేనా..? ప్రజలు బాగా ఆలోచించాలని, ధరణిని తీసేయవద్దంటే, రైతుబంధు ఎప్పటిలాగే కొనసాగాలంటే ఇక్కడ దుర్గం చిన్నయ్యను గెలిపియ్యాల్నని కెసిఆర్ పిలుపునిచ్చారు. దుర్గం చిన్నయ్య లాంటోళ్లు గెలిస్తెనే రేపు రాష్ట్రంలోబీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వొస్తది. అప్పుడే రైతుబంధు ఎప్పటిలాగే కొనసాగుతదన్నారు. తాము 24 గంటల కరెంటు ఇస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు. కేసీఆర్ వేస్టుగ ఇస్తున్నడని హేళన చేస్తున్నడు.

నిజంగానే మూడు గంటల కరెంటు సరిపోతదా..? సరిపోదు గదా..? మరి 24 గంటల కరెంటు కొనసాగాలంటె ఏంజెయ్యాలె..? దుర్గం చిన్నయ్యను గెలిపించాలె. లేదంటే కరెంటు కాట గలుస్తది. రైతుబంధుకు రాంరాం. మనం గుద్దేకాడ గుద్దకపోతే ఏమైతది..? తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లె మనం చల్లె. అందుకే ఆలోచించి వోటేయాలి. మోసపోతె గోసపడ్తని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల క్షేమం గురించి పట్టించుకోలే. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వొచ్చినంక రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నం. రైతబీమా సదుపాయం కల్పిస్తున్నం. కొత్తకుండలో ఈదొచ్చినట్లు తెలంగాణ వొచ్చినప్పుడు ఏముండె..? మంచి నీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు, పేదవాళ్లు చచ్చిపోవుడు, రైతులు చచ్చిపోవుడు, చేనేత కార్మికులు చచ్చిపోవుడు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండె. ఒక్కొక్కటి సగబెట్టుకుంటూ అవినీతి రహిత పాలన చేస్తుంటే ఇప్పుడు తెలంగాణను ఇంత దూరం తీసుకొచ్చినం. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపియ్యాలె. దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని తాను కోరుతున్నానన్నారు. బెల్లంపల్లిలో ప్రభుత్వ, సింగరేణిలో జాగాలు కలిపి దాదాపు 10 వేల మందికి ఇళ్ల పట్టాలు వొచ్చినయని, ఇంకా కొంత మంది ఉన్నరని చిన్నయ్య చెప్పిండని, వాళ్లందరికి గూడా పట్టాలు ఇప్పిచ్చే బాధ్యత తనదని కెసిఆర్ హా ఇచ్చారు. ఎవరున్నా ఎమ్మెల్యేగారికి దరఖాస్తు పెట్టుండ్రి. తప్పకుండా వాళ్లందరికీ ఇస్తం అన్నారు. ఇవాళ డబ్బు కట్టలు పట్టుకొని దిగుతున్నరు.
ఎన్నికలు అయిపోతే మళ్లీ కనడబరు.. చెన్నూరు ప్రజలు ఈ మనిషిని నాలుగుసార్లు ఓడగొట్టారు. ఇక్కడికి వొచ్చిన కాంగ్రెస్ మనిషిని. మరి చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతుదా..? చెన్నూరులోనే చెల్లకపాయే వాళ్లే తీసికొట్టిరి. మరి బెల్లంపల్లిలో ఉన్న మనం తెలివి తక్కువ వాళ్లమా..? చెన్నూరు కంటే మనం తెలివి గల వాళ్లమే కదా..? మరి రుజువు చేయాలి. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్ల చెల్లుతది. వాళ్లు తిరస్కరించిన తర్వాత మనం ఎట్ల గెలిపిస్తాం. ఎలక్షన్ల తర్వాత ఉంటారా..? కడుపునొచ్చినా.. కాళ్లు నొచ్చినా కనబడుతారా..? ఎన్నికలు రాగానే సూట్కేసులు పట్టుకోవాలా..? డబ్బు సంచులు పట్టుకోవాలా..? దిగాలా.? వాన్ని వీన్ని కొని గోల్ మాల్ చేయాలా.. ఇదే వారి పని. మంచిగున్న ప్రజా ప్రతినిధులను కొందరిని కొంటున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. చిన్నయ్య నువ్వేం ఫికర్ చేయకు…అమ్ముడుపోతే వాడొక్కడే గడ్డపారలాగా అమ్ముడుపోతడు..ఇవాళ ప్రజల్లో చైతన్యం ఉంది. ప్రజలు నీ పక్షాన ఉంటారు. ప్రజలు న్యాయం చెప్తారు. ఎవడో నలుగురు అమ్ముడుపోయినంత మాత్రాన వాడు తలమాసినోడు అయితడు గానీ మనం కాము. ఈ ప్రజలే మనల్ని కాపాడుతారు. ప్రజల ఆశీర్వాదమే మనకు శ్రీరామరక్ష అంటూ ధైర్యం నింపారు. కాంగ్రెస్, బీజేపోళ్లకు సెల్ఫ్ ఉండదు. ఢిల్లీలో కట్క వేస్తేనే ఇక్కడ లైట్ వెలుగుతది. మాకు ఎవ్వరూ బాసులు లేరు.. తెలంగాణ ప్రజలే మా బాసులు. అవసరాలు, మంచి చెడు గురించి, ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేం పని చేస్తున్నామని కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. నాటి కాంగ్రెస్ నేతల చేతగాని తనంవల్లే సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
చేతగాని కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్టాన్ని్ర అమ్ముకుంటదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను వోటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బెల్లంపల్లి చైతన్యం ఉండే ప్రాంతం. ఇక్కడ ఉద్యమాలు జరిగన ప్రాంతం. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం లో దళితుల బతుకులు బాగు పడలేదు. తరతరాలుగా, యుగయుగాలుగా అణిచివేతకు గురయ్యారు. తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారు. ఆనాడే నెహ్రూ దళితుల గురించి అభ్యుదయమైన కార్యక్రమం చేసి ఉంటే ఇవాళ్టికి దళితుల బతుకులు ఇలా ఎందుకు ఉండేవి..? దయచేసి ఈ విషయాలు ఆలోచించాలి. ఇది నిజమా..? కాదా..? అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. దళితుల గురించి ఒక స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టలేదు. అది చేసి ఉంటే దళితుల దుస్థితి ఈ విధంగా ఉండేది కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు. 1956 వరకు మన తెలంగాణ మనకు ఉండే. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందేవరు.? గోస పెట్టిందేవరు..? కరువుల పాలు చేసిందేవరు.? ఉన్న తెలంగాణను నాశనం పట్టించి సిటీ కాలేజీ వద్ద ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం జరుగుతుంటే ఏడుగురు విద్యార్థులను పట్టపగలు కాల్చేసి, తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధప్రదేశ్లో కలిపారు. ఆ తర్వాత 56 ఏండ్లు గోస పడ్డాం.
ఆ తర్వాత 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చారు. మళ్లీ 2001లో గులాబీ జెండా ఎగురవేస్తే, 2004లో తెలంగాణ ఉద్యమాన్ని చూసి, ప్రత్యేక రాష్టాన్ని్ర ఇస్తామని చెప్పి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. వాళ్లకు లాభమైంది. 2005, 2006లో తెలంగాణ ఇవ్వలేదు. 15 ఏండ్లు ఏడిపించారు. చివరకు మొండిగా ముందుకు పోతే, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్షకు దిగితే దిగొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. మళ్లా ఏడాదిన్నర కొట్లాడితే ఉప్పెన రు లేస్తే, సకల జనుల సమ్మెతో ఉద్యోగులు కొట్లాడితే అప్పుడు దిగొచ్చి, ఇక దిక్కు లేకుండా అయితామని చెప్పి భయానికి తెలంగాణ ఇచ్చారు. అంటే ఎంత నస్టపరిచారు. నాడు మన తెలంగాణ మనకు ఉంటే ఎక్కడ ఉందుము.. ఏ విధంగా ఉందుము.. ఇది కాంగ్రెస్ అవలంభించే పద్ధతి అని కేసీఆర్ మండిపడ్డారు.