– అధికారులకు స్పెషల్ సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ముందుగా గన్ పార్క్ను సందర్శించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్, గన్ పార్కు వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లపై ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్కు వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. వాటర్ ప్రూఫ్ షామియానాలు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ శాఖను ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనుల నిర్వహణతోపాటు తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ఆయన ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ నగరంలోని ప్రముఖ ప్రదేశాలైన అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం, చార్మినార్, ప్రజాభవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 25 నుంచి పరేడ్ గ్రౌండ్ వద్ద అన్ని విభాగాలు సంయుక్తంగా రిహార్సల్స్ చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నవీన్ మిట్టల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, కార్యదర్శి రఘునందన్ రావు, డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, ఏడీజీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, జెన్ కో సీఎండీ హరీష్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




