ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబో వినియోగం
ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుక్రవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 30 హెచ్ పి సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్ ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు వెల్లడించారు.
ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. మాన్యువల్ డిగ్గింగ్ కు బదులుగా ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోను వినియోగిస్తున్నారని, ఇది అధునాతన సాంకేతికతతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియను నిర్వహిస్తుందని తెలిపారు., డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయడానికి ఈ ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాక్యూమ్ ట్యాంకు ద్వారా వొచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించవచ్చని వివరించారు.
అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం గల యంత్రాల వినియోగం ద్వారా సహాయక చర్యలను మరింత వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. ఆర్మీ,సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ర్యాట్ మైనర్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైడ్రా, అన్వి రోబోటిక్స్,దక్షిణ మధ్య రైల్వే, బృందాలు, సహాయక చర్యలలో పాల్గొంటున్నట్లు వివరించారు.




