భరతమాత ఫౌండేషన్ ద్వారా మహా హారతి
రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి
140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం
వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 25 : భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నుంచి సంవిధాన్ (రాజ్యాంగం) గౌరవ్ అభియాన్ యాత్రను ప్రారంభించి వొచ్చే ఏడాది 2026 జనవరి 26 వరకు నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. భరతమాత ఫౌండేషన్ ద్వారా ఈ మహా హారతి కార్యక్రమాన్ని గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఆదివారం నిర్వహించే యాత్ర 8వ సంవత్సరంగా పేర్కొన్నారు.
దేశ స్వాతంత్య్రం సిద్ధించడంలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహనీయుల కృషి దాగి ఉందన్నారు. శనివారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో భారత మాత ఉరేగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో కొంతమంది భారత రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని వారు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందన్నారు.
భారత రాజ్యాంగం, భరతమాత అందరికి ఒక్కటేనని అర్థం చేసుకోవాలన్నారు. 140 కోట్ల మంది ప్రజలు, దేశ సైనికులు, దేశ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతీ ఒక్కరికి నేటి మహా హారతి కార్యక్రమం అంకితమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ హాజరవుతారన్నారు. గతంలో కూడా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారని, ఈ సారి కూడా వారందరూ వస్తారని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.





