రాములోరు పెళ్లికొడుకాయనే..

  • స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం
  • స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు తయారు
  • వేడుకలను తలకించి పులకరించిన భక్తులు..

భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్ధానం ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఇందుకోసం ముందుగా 13న అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్‌ 6న ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్బంగా శుక్రవారం నుంచే రామాలయంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం స్వామివారికి సహస్ర ధారతో ప్రత్యేక స్నపనం నిర్వహించిన అనంతరం స్వామివారిని ఊయలలో ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆస్థాన హరిదాసులు. రామదాసు, తూము నరసింహదాసు కీర్తనలను ఆలపిస్తుండగా నక్షత్ర, కుంభహారతులను స్వామివారికి సమర్పించారు. కల్యాణ ఉత్సవమూర్తులకు అభిషేకం, పూర్ణాహుతి చేశారు. అనంతరం రామయ్యకు కంకణధారణ చేశారు. వసంతోత్సవాన్ని నిర్వహించి సాయంత్రం బాజాభజంత్రీల మధ్య తిరువీధి సేవ నిర్వహిస్తారు.

డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించిన రోజున భద్రాద్రి రామయ్యను పెళ్లికుమారుడిని చేసినట్టుగా భక్తులు భావిస్తారు. శ్రీరామున్ని పెళ్లి కుమారిడిగా అలంకరించారు. బుగ్గన కస్తూరి దిద్ది స్వామిని ఊరేగింపుగా భద్రుని మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ఆరాధన చేశారు. ఊయలలో కూర్చుండ బెట్టి జోలపాటలు పాడారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం జరిగింది. భక్తులు ఆనందోత్సవాలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు డోల పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 300 క్వింటాళ్ల కల్యాణ తలంబ్రాలను సిద్ధం చేయనుండగా శుక్రవారం సుమారు 20క్వింటాళ్లు తయారు చేసారు. మందుగా పసుపు కొట్టి కల్యాణం పనులు ప్రారంభించారు.

పెళ్లి కొడుకైన రామయ్య : సిగ్గులొలక పోస్తూ సీతమ్మ ఆయన చెంత కూర్చుంది. ఈ వేడుకను తిలకించిన భక్త జనం పులకించిపోయారు. తొలుత శ్రీరాముని, సీతాదేవికి విశేషస్నపనం నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం సీతారామచంద్రులను ఊయలలో కూర్చుండబెట్టి కీర్తనలు ఆలపించారు. మూలవరులకు, లక్ష్మీతాయారమ్మ వారికి యాగ రాముని, సీతారాముల కళ్యాణం నిర్వహించే ఉత్సవమూర్తులకు వసంతోత్సవం జరిగింది. వంజీర పసుపు ముద్దలను స్వామివారు, అమ్మవారిపై ఉంచారు. వసంతోత్సవం నిర్వహించి 108 వత్తుల హారతి నిర్వహించారు. అనంతరం నివేదన జరిగింది. ఈ వైభవమైన కార్యక్రమంను భక్తులు ఎంతగానో భక్తి శ్రద్దలతో తిలకించారు. ముందుగా దేవస్దానం అధికారులు, సిబ్బంది,భక్తులు వసంతోత్సవం అడారు.

పెళ్లికి 300 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు : ఏప్రియల్‌ 6న జరిగే శ్రీ సీతారాముల పెళ్లికి 300 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్దం చేయనున్నారు. ముందుగా సుమారు 20 క్వింటాళ్ల తలంబ్రాలను హోలీ పౌర్ణమి నాడు సిద్దం చేశారు.బియ్యంలో సుగంధద్రవ్యాలు, అత్తరు,పసుపు కుంకుమలతో కలగలిపి తలంబ్రాలు సిద్దం చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. స్వామివారి తలంబ్రాలు భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు. అనేక మంది భక్తులు,భక్త బృందాలు స్వామివారి తలంబ్రాలు కలిపారు.కాబట్టి వాటికున్న పవిత్రత ఎక్కడా దెబ్బతినకుండా ఆలయాధికారులు కార్యాచరణ రూపొందించారు. 300 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్దం చేశారు.

నేడు అమ్మవారికి సామూహిక పూజలు : దేవస్థానంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో బుధవారం స్వర్ణ లక్ష్మి అమ్మవారికి సామూహిక పూజలు నిర్వహించనున్నారు. 600 చెల్లించిన భక్తులకు అమ్మవారి వెండి ప్రతిమ, లడ్డూ, పులిహోర ప్రసాదం, పూజా కుంకుమను అందిస్తారు. ఉదయం స్వర్ణలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించనుండగా పాల్గొనాలనుకున్న భక్తులు 100 చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *