తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్-2026) ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులను ఎదురుకుంటున్నది.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి స్వచ్ఛమైన వోటర్ల జాబితాను తయారు చేయడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ) కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని బీఎల్ఓలు ఎదుర్కొంటున్న బహుముఖ ఒత్తిళ్లు, సాంకేతిక లోపాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన అదనపు బాధ్యతలు ఈ ప్రతిష్టాత్మక ప్రక్రియను నెమ్మదింపజేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తాజా నివేదిక ప్రకారం, గడువు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 28 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు మాత్రమే తిరిగి సేకరించడం ఈ ఆందోళనకర పరిస్థితికి అద్దం పడుతున్నది .సమస్యల సుడిగుండంలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రస్తుత సవరణ ప్రక్రియలో ప్రతి బీఎల్ఓ దాదాపు వెయ్యి మంది వోటర్ల ఇళ్లను కనీసం మూడుసార్లు సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, పూర్తి చేయించి సేకరించాల్సి ఉంది.
కానీ, ఈ విధులకు తోడు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ బాధ్యతలను కూడా వీరికే అప్పగించడం అదనపు భారంగా మారింది. ఒకవైపు వోటర్ల సర్వే, మరోవైపు సంక్షేమ పథకాల పంపిణీ పర్యవేక్షణతో సిబ్బంది శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.మరో ప్రధాన అవరోధం ఎన్నికల సంఘం యాప్స్ మరియు వెబ్సైట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు. ఆన్లైన్ ద్వారా ఫారాలను సమర్పించేందుకు ప్రయత్నిస్తున్న వోటర్లకు సర్వర్ లోపాలు నిరాశ మిగులుస్తున్నా యి. దీనివల్ల డిజిటలైజేషన్ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతోంది. దీనికి తోడు, పట్టణ ప్రాంతాలలో తాళం వేసి ఉన్న ఇళ్లు, వలస వెళ్లిన వోటర్ల వివరాల సేకరణ మరియు ఫారాల కొరత వంటి అంశాలు బీఎల్ఓల పనిని మరింత సంక్లిష్టం చేశాయి.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్-2026) ప్రక్రియ గతంలో 2002–2004 కాలంలో జరిగిన సవరణతో పోలిస్తే పూర్తి భిన్నం. అప్పట్లో కేవలం వోటర్ల వివరాలను సేకరించే సాధారణ ప్రక్రియగా సాగిన ఈ విధానం ఇప్పుడు సాంకేతికత, ముందస్తు నిబంధనలతో కూడిన ఒక సంక్లిష్టమైన స్క్రీనింగ్ ప్రక్రియగా మారింది. సర్-2002 సర్ కేవలం ఒక కొత్త బేస్లైన్ (మౌలిక) ప్రక్రియ. బూత్ స్థాయి అధికారులు ఇళ్లకు వెళ్లి వోటర్లను కొత్తగా నమోదు చేయడం లేదా తప్పులను సరిదిద్దడం మాత్రమే చేశారు. పాత చారిత్రక రికార్డులతో సరిపోల్చడం లాంటివి అప్పట్లో లేవు. ప్రస్తుత సర్ ప్రక్రియ పూర్తిగా “లెగసీ డేటా” పై ఆధారపడి సాగుతోంది. ప్రస్తుతం ఉన్న వోటరు వివరాలను 2002 నాటి వోటర్ల జాబితాతో (బేస్లైన్) క్రాస్-వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒకవేళ వోటరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు 2002 నాటి రికార్డులతో సరిపోలేకపోతే, వారు తమ అర్హతను నిరూపించుకోవడానికి అదనపు పత్రాలను సమర్పించాల్సి వొస్తుంది . 2002లో ఈ ప్రక్రియ పూర్తిగా మాన్యువల్ (కాగితాల) పద్ధతిలో సాగింది. ఫిజికల్ ఫారాలు, ప్రింట్ చేసిన రిజిస్టర్లు, మాన్యువల్ డేటా ఎంట్రీపైనే సిబ్బంది ఆధారపడ్డారు. డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ అస్సలు లేదు.
ALSO READ: కాళేశ్వరం పై అధికార ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు?
ప్రస్తుత ఇది పూర్తి స్థాయి సాంకేతిక ఆధారిత ప్రక్రియ. బీఎల్ఓలు ప్రత్యేక ఈసీఐ మొబైల్ యాప్లను వాడుతున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. వోటర్లు కూడా నేరుగా ఇంటర్నెట్ ద్వారా ‘ఈసీఐ ఓటర్స్ సర్వీస్ పోర్టల్’ లో తమ ఫారాలను ఆన్లైన్లో సమర్పించే వెసులుబాటు ఉంది. 2002లో వోటర్ల తొలగింపు లేదా మార్పులు కేవలం క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగానే జరిగాయి. డేటాలో ఉండే అంతర్గత తప్పులను గుర్తించే ఆటోమేటిక్ వ్యవస్థ లేదు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా వోటర్ల డేటాలోని 11 రకాల జీవసంబంధిత వ్యత్యాసాలను కంప్యూటరే స్వయంగా గుర్తిస్తోంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు-పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం (15 ఏళ్ల లోపు), తోబుట్టువుల పుట్టిన తేదీల్లో అసాధారణ తేడాలు ఉండటం, పాత రికార్డులకు ప్రస్తుత రికార్డులకు బంధుత్వాల పేర్లు మారడం వంటి తప్పులను సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఫ్లాగ్ చేస్తోంది. 2002లో ఎన్నికల సంఘం చాలా సుదీర్ఘమైన సమయాన్ని ఇచ్చింది. ఈ ప్రక్రియ దాదాపు రెండేళ్ల పాటు (2002 నుండి 2004 వరకు) సున్నితంగా సాగింది. దీనివల్ల క్షేత్రస్థాయి సిబ్బందిపై పెద్దగా ఒత్తిడి లేదు. ప్రస్తుతం కేవలం నెల రోజులు సమయం మాత్రమే ఇవ్వడంతో బీఎల్ ఓలపై విపరీతమైన వత్తిడి పడుతోంది.
ఈ ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) ద్వారా దశాబ్దాలుగా వోటర్ల జాబితాలో పేరుకుపోయిన నకిలీ వోట్లు, మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న వోట్లను (ఏఎస్డీ వోటర్లు) పూర్తిగా తొలగించే అవకాశంతోపాటు, భవిష్యత్తులో పారదర్శకమైన ఎన్నికలకు పునాది వేస్తుంది. కానీ కాలపరిమితి చాలా తక్కువగా వుండటం పని ఒత్తిడి వల్ల క్షేత్రస్థాయి పరిశీలన నాణ్యత లోపించే ప్రమాదం ఉంది. ఫారాలు సకాలంలో అందకపోవడం లేదా సాంకేతిక లోపాల వల్ల తిరిగి సమర్పించలేకపోవడం వల్ల అర్హులైన నిజమైన వోటర్ల పేర్లు కూడా జాబితా నుండి తొలగింపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. చేయవలసిన మార్పులు – ముగింపుకేవలం 28 శాతం ఫారాల సేకరణతో ఎన్నికల సవరణ లక్ష్యం నెరవేరడం అసాధ్యం. ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి బీఎల్ఓలపై ఉన్న అదనపు సంక్షేమ పథకాల పంపిణీ భారాలను తగ్గించాలి. అలాగే సాంకేతిక లోపాలను యుద్ధప్రాతిపదికన సరిచేయాలి. వోటర్లలో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సమయం (గడువు పొడిగింపు) మరియు మౌలిక వసతులు కల్పించినప్పుడే ఈ ప్రక్రియ విజయవంతమౌతుంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన విజయం చేకూరుతుంది.





