మైనార్ బాలికపై అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bhagirath) పై పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్లోని మొయినాబాద్ ఫామ్హౌస్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వొస్తున్నాయి. ఈ వేధింపుల కారణంగా బాధితురాలు రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. చివరికి గత అర్ధరాత్రి ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, మొదట్లో బండి భగీరథ్పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటంతో పోలీస్ స్టేషన్ వద్ద సుమారు ఆరు గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుంది. ఆ తర్వాత బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు అనంతరం బండి సంజయ్ కొడుకు భగీరాథ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. ఇంతకుముందు కూడా కాలేజీలో ఓ విద్యార్థిపై దాడి చేసి భగీరథ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే భగీరథ్పై పాత వివాదాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్గా మారింది. భగీరథ్ను ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్తో పోలుస్తూ ఆర్జీవీ అప్పట్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది.





