- సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తా..ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
- విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి: ప్రొఫెసర్ జి.హరగోపాల్
హిమాయత్నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తానని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదం డరాం హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఆట్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం యూనివర్సిటీలను పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పనిచేసే ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు స్కేట్ న్యాయమైన డిమాండ్ అని దీని పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. ఉద్యోగులు ఐక్యతను కాపాడుకుంటూ సామాజిక న్యాయంతో ముందుకు సాగాలని కోరారు.
ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ విశ్వ విద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం అదేశాలకు అనుగుణంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చిందని, దీంతో విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కోల్పోయిందన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తున్నాయన్నారు. వొచ్చే బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ అమలు చేసి పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
సుప్రీం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల స్కేల్ న్యాయమైందన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తమ్, తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డా. చారగొండ వెంకటేశం, జేఏసీ చైర్మన్ సూర్యచందర్, అధ్యక్షుడు కట్ట వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు ఎస్.అరుణ్ కుమార్, టి.చేతన్, మన్మోహన్, కన్వీనర్ సి.శ్రీనివాస్, కె.శ్రీకాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.





