డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, ప్రజాతంత్ర, నవంబర్ 8 : మధిర పట్టణం నిరంతరం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. శుక్రవారం ఆయన మధిర క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధిర మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మధిర పట్టణంలో ప్రతీ చోట పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు ఏర్పాటు చేయాలని, రాయపట్నం బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు శివాలయం మీదుగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తడి పొడి చెత్త సేకరణకు ఇంటింటికి చెత్త డబ్బాలను పంపిణీ చేయాలని, ప్రతిరోజు ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించాలన్నారు. మధిర పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి స్విపీంగ్ మిషన్ కొనుగోలు చేయాలని సూచించారు.
మున్సిపాలిటీతో పాటు మండల కేంద్రాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు ట్రీ కట్టర్, గ్రాస్ కట్టర్స్ కొనుగోలు చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. మధిర మున్సిపాలిటీలోని చెత్త సేకరించే వాహనాల మూమెంట్ తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన జిపిఆర్ఎస్ ట్రాకింగ్ ను కలెక్టర్ మొబైల్ కు కనెక్ట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. అధునాతనంగా మధిర మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఉండేలా డైమెన్షన్ వేయించాలని సూచించారు. ఖాలీ ప్లాట్లలో చెత్తాచెదారం లేకుండా సంబంధిత యజమానులకు అవగాహన కల్పించాలని, మధిరలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్కడ పచ్చదనం కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మధిర మున్సిపల్ పరిధిలో రోడ్డు హద్దులు దాటి నిర్మాణాలు జరిగితే మున్సిపల్ కమిషనర్ దే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీలో వీధి దీపాలు వెలిగే విధంగా నిత్యం పర్యవేక్షణ చేయాలని, మధిర పట్టణంలోని వరద మంపు ప్రాంతాల్లో సీసీ రోడ్లను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.