– జల్ శక్తి శాఖ, ఎన్డీఎస్ఏ నుంచి సాంకేతిక మార్గదర్శకాలు కోరాలి
– పూర్తి సాంకేతిక నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం
– అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ ఆదేశాలు
– పూర్తి సాంకేతిక నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం
– అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన అధ్యక్షతన కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పురోగతిపై శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో(నీటి నిల్వ లేకుండా) విధానంలో నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నీటి నిల్వ, పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలా వద్దా అన్న అంశంపై రాజకీయ ఒత్తిళ్లు లేదా పైకి కనిపించే పరిస్థితుల ఆధారంగా కాక అర్హత కలిగిన సాంకేతిక సంస్థల లిఖితపూర్వక సిఫారసుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు పంపే లేఖలో ఎన్డీఎసఏ నివేదికలోని కీలక సిఫారసులు, గత సాంకేతిక పరిశీలనల వివరాలు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదికలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల ఫలితాలు, రాఫ్ట్ ఫౌండేషన్ కింద గుర్తించిన ఖాళీల వివరాలు, ఫొటోలు, ఇతర ఇంజినీరింగ్ ఆధారాలు అన్నింటినీ జత చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బ్యారేజీలను నీటి నిల్వకు, పంపింగ్కు ఎందుకు వినియోగించడం లేదన్న విషయాన్ని పూర్తి సాంకేతిక ఆధారాలతో కేంద్రానికి వివరించి సమర్థ సాంకేతిక సంస్థల నుంచి అధికారిక అభిప్రాయం కోరాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం మొత్తం అధికారిక రికార్డులో ఉండాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులకు వెంటనే అందేలా రాష్ట్ర ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ ద్వారా లేఖను స్వయంగా అందజేయాలని కూడా ఆదేశించారు. ఇటీవల కేంద్ర జల్ శక్తి మంత్రి చేసిన ప్రకటనలు, ఆ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన లేఖలు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలే బ్యారేజీల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నప్పటికీ ఎన్డీఎసఏ నివేదికలో స్పష్టంగా సూచించిన ‘ఫ్రీ-ఫ్లో విధానంలో కొనసాగించాలి’ అనే అంశంపై ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని సమీక్ష సందర్భంగా అధికారులు వివరించారు. మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం బ్యారేజీలపై జరుగుతున్న ప్రతి శాస్త్రీయ పరిశీలన, ప్రతి సాంకేతిక పరీక్ష కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఎసఏ సూచనల ప్రకారమే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రత, నిర్మాణాల స్థిరత్వం, శాస్త్రీయ ప్రమాణాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు.
అన్నారం ర్యాఫ్ట్ ఫౌండేషన్లోనూ సాంకేతిక సమస్యల సంకేతాలు
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ తాజా జీపీఆర్ పరీక్షలు, ఇతర సాంకేతిక సమాచారం విశ్లేషణను తుది దశకు తీసుకెళ్లిందని అధికారులు తెలిపారు. అలాగే అన్నారం బ్యారేజీ ర్యాఫ్ట్ ఫౌండేషన్ కింద కూడా ఖాళీలు ఉన్నట్లు సూచించే సాంకేతిక ఆధారాలు లభించాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ కూడా నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధ్యయనాల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ ఈ ఆగస్టు నెలాఖరులోగా సిద్ధమవుతుందని, మధ్య సెప్టెంబర్ నాటికి ప్రాథమిక వ్యయ అంచనాలు కూడా సిద్ధం కానున్నాయని అధికారులు తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అదనపు సాంకేతిక విశ్లేషణలు మరో రెండు వారాల్లో పూర్తవుతాయన్నారు. అనంతరం వాటిని టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ముందుంచాలని మంత్రి ఆదేశించారు.
కనిపించే నీరు ఒక్కటే ప్రామాణికం కాదు
ప్రస్తుత వర్షాకాలంలో పంపింగ్ కార్యకలాపాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కేవలం దిగువకు నీరు ప్రవహిస్తున్నందుకే పంపింగ్ సాధ్యమవుతుందని భావించడం సరికాదని అధికారులు స్పష్టం చేశారు. పంపింగ్కు అవసరమైన అప్స్ట్రీమ్ నీటి మట్టం ప్రస్తుతం కొనసాగించే పరిస్థితి లేదని, తాత్కాలిక ఏర్పాట్లతో పంపింగ్కు ప్రయత్నించడం వల్ల ఫలితం లేకపోవడమే కాక బ్యారేజీల కింద ఉన్న నిర్మాణ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ‘కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఒక్క అడుగు కూడా రాజకీయ ఒత్తిళ్లతో వేయం.. ప్రతి నిర్ణయం శాస్త్రీయ ఆధారాలు, ఇంజినీరింగ్ ప్రమాణాలు, నిపుణుల సిఫారసుల మీదే ఆధారపడి ఉంటుంది.. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం’ అని స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపైనా మంత్రి సమీక్ష నిర్వహించారు. నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న అంశాలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రస్తుతం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాసెసింగ్ ముందుకు సాగడం లేదని అధికారులు వివరించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





