– వారందరికి కెటిఆర్ రూ.2 కోట్ల చొప్పున చెల్లించాలి
– బర్త్డే రోజయినా అబద్దాలు మాట్లడకుండా ఉండలేడు
– మీడియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై24: బీఆర్ఎస్ హయాంలో గ్లోబరీనా సంస్థ విద్యార్థుల చావుకు కారణమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. 28 మంది విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు ఆ సంస్థ కారణం కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం బర్త్డే రోజైనా కెటిఆర్ అబద్దాలు మాట్లాడకుండా ఉంటే మంచిదన్నారు. గ్లోబరీనా సంస్థ రిపోర్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదన్నారు. దీని వెనుక కేటీఆర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. నీట్ పేపర్ లీకైన నెలన్నరకు ఆయన నిద్రలేచారని మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలని సూచించారు. నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు. కపట ప్రేమలు, నల్లచొక్కా డ్రామాలు నడవవని చెప్పుకొచ్చారు. ’రేవంత్ ఢిల్లీకి వెళ్తే ఏంటి? వెళ్లకపోతే ఏంటి?.. కొడంగల్లో నిరసన చేశారు’ అని అన్నారు. విద్యార్థుల ఉద్యమంపై కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్లో కేటీఆర్ ధర్నా చేశారని.. ధర్నా చేసే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. కేటీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాక ధర్నా చేస్తే బాగుంటుందని మహేష్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అకౌంట్ నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 27 మంది విద్యార్థుల మరణానికి కారణం గ్లోబరీనా సంస్థ అని ఆరోపించారు. 2011లో జరిగిన గ్లోబరీనా అంశంలో నివేదిక ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ’గ్లోబరీనాపై విచారణకు కేటీఆర్ ఫిర్యాదు చేయాలి. మాకు మేముగా విచారణ చేస్తే కక్ష సాధింపు అంటారు’ అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్లు అందరికీ తెలుసని అన్నారు. ఇసుక వ్యాపారంతో ఎంతోమంది చావులకు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని.. రెండూ ఒకటే అనడానికి బలమైన కారణాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు