ఆచరణ సాధ్యమైన ప్రణాళికను దేశం కోసం రూపొందించి అందించిన మానవీయ విలువల పరిరక్షకుడు మహాత్మా జ్యోతిరావుపూలే. కుల వివక్ష, అంటరానితనం, స్త్రీ విద్యా ఆవశ్యకతపై గళమెత్తిన తొలి సంఘసంస్కర్తగా, బడుగులే భారతావనికి ముందు చూపవుతారని చెప్పిన క్రాంతిదర్శిగా జ్యోతిరావు పూలేను బహుజన బావుటా దీర్ఘ కావ్యంలో కవి వనపట్ల సుబ్బయ్య అభివర్ణించారు. పేదలు బతుకు రాతల్ని మార్చుకోవాలని, బతుకు సిద్ధాంతం నేర్చుకోవాలంటూ ఒక చోట కవి రాసిన మాట పూలే స్ఫూర్తిని స్పష్టంగా చెప్పింది. జ్యోతిరావుపూలే జీవిత చరిత్రను దీర్ఘ కవితలో అనేక సందర్భాలను, సంఘటనలను ఉదాహరిస్తూ కవి చెప్పారు. జులూస్, కుర్చీ, వొల్లెడ వంటి ఆదరణ పొందిన దీర్ఘ కవితలను ఇది వరకే రాసిన ఈ కవి బహుజన బావుటాను స్థానీయత, సత్యావిష్కరణ, మానవీయతా విలువలతో పాఠకులకు ఆసక్తి కలిగించే రీతిలో రూపొందించి అందించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణగా 2023లో ఈ దీర్ఘ కవిత వెలువడింది. కులం జులుంపై కలమెత్తిన వనపట్ల శీర్షికతో అప్పటి సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ముందు మాట రాశారు. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులతో పాటు అక్షర సంచారి, నడుస్తున్న గ్రంథాలయం, తనకు మార్గదర్శి అయిన నాగవరం బల్రాంను కవి తొలుత స్మరించారు.
మహారాష్ట్రలో సత్యశోధక్ సమాజ్ స్థాపనతో ప్రభవించిన పూలే సమానత్వ సాధన, మానవీయ విలువల ప్రతిష్టాపన కోసం శంఖారావాన్ని పూరించి ప్రజా చైతన్య సాధన కోసం నడుం బిగించారు. తొలి అడుగు కుల సర్పాలు/ బతుకు సూర్యుడిని మింగినప్పుడు/ ఒక వేగుచుక్క పొడిచింది/ నియంతలు/ భూమిని చెరబట్టినప్పుడు ఒక విస్ఫోటనం పుట్టిందంటూ పూలే ఆవిర్భావాన్ని ప్రకటిస్తూ ఈ దీర్ఘ కవితను కవి ఆరంభించారు. ఆచారాలు సామాన్యుల గుండెల్ని పుండు చేసినపుడు, అంధకారాన్ని తరిమేందుకు అక్షరమే ఆయుధమని చాటిన మహాబలిగా, మహోన్నత మూర్తిగా పూలేను కొనియాడారు. శిరస్సెత్తిన చేతనా కేతనమైన పూలే భారతావనికి ముందుచూపని చెప్పారు. పూలే తన సహచరికి చదువును బోధించి విద్యావ్యాప్తికి పాటుపడ్డారని తెలిపారు. కింది కులాల విముక్తికై మానవ హక్కుల ప్రతిష్టాపనకై పోరాడిన ఆధునిక సామాజిక విప్లవ పితామహుడని చెప్పారు. సామాజిక వికాసానికై గళమెత్తిన మహాజన ధ్రువతార, అణగారిన బతుకులకు వెలుగు దారిగా మారిన మన ఆధునికుల్లో ఆధునికుడన్నారు. నల్ల కలువల నవ్వులకై / గడ్డి పూల గెలుపుకై / గిజిగాళ్ల పలుకుకై/ హద్దులు లేని పొద్దుకై / గుండె చూపి నడిచిన/ త్యాగాల తొలి అడుగు/ తొలి వేగుచుక్క పూలే అని అక్షర నమస్కారం చేశారు.
మనిషే దేవుడని భావించి సత్యశోధనకు ముందుకు సాగిన మహామనీషి పూలే అన్నారు. శాస్త్రీయతకై పోరాడిన శాస్త్రవేత్తగా పూలేని చూపి అంధ విశ్వాసాల నిర్మూలనకు చేసిన కృషిని వివరించారు. సత్యాగ్రహమై పోరాడి సమతా మమతకు పాదులు తీసి సామాజిక న్యాయ సాధనకు పోరాడిన మహోన్నతుడని చెప్పారు. సత్యాన్ని సూర్యుడిలా వెలిగించిన మహాదేవుడని తెలిపారు. గులాంగిరి నుండి విముక్తి లేనిదే బహుజనులకు విముక్తి లేదని చెప్పారు. రాత్రి బడులకు ముగ్గుపోసి / విజ్ఞానానికి పందిర్లేసిన మహనీయుడు, మహాజన సూర్యుడు పూలే అన్నారు. కవి తాను పొందిన జ్ఞానానికి మార్గదర్శి పూలే అని తెలిపి నా కవిత్వమంతా నీదేనని ఆయనకే చెప్పుకున్నారు. సత్యశోధనలో ఎన్నో చుక్కలు చంద్రవంకలయ్యాయని తెలిపారు. సంఘ సంస్కరణలు సామాజిక వికాసాలై పురి విప్పాయని అన్నారు. నేలకు తొలి హరిత గీతం, యుద్ధగానం పూలై అని చెప్పారు. జ్ఞాన పరిమళంతో వికసించిన ఆధునిక వైతాళికుడు, దీనుల ధర్మజ్యోతి పూలే అన్నారు.
అక్షరం వెలగాలంటే బడులు పూదోటలై పూయాలన్నారు. ఊరూరా బడులు పెట్టి, పుస్నకాలు ఇప్పించి, బట్టలు, దుప్పట్లు పంచాడని చెప్పారు. విద్యనే వివేకం వికాసం / విద్యనే ఆత్మగౌరవమన్న మహాత్ముడు పూలే వీధిలో నడుస్తుంటే దురహంకారులకు ఉలికి పాటు అన్నారు. వితంతువులు, అనాధలు, గరీబులను సామాజిక శరణాలయమై గుండె కత్తుకున్న పూలే నేటి స్వేచ్ఛా వికాసానికి ఆది అని ప్రస్తుతించారు. పూలే నాటిన సామాజిక విత్తనం ఆధునిక బోధి వృక్షమై దారి చూపిందని తెలిపారు. పూలే జీవిత పాఠం తరతరాలకు వెలుగులా అందాలన్నారు. మోయలేని వెట్టి వెతలపై వేకువ, పొద్దై పొడిచిన మహాత్ముడవు, పీడిత జన బాంధవుడవు అని పూలేని కొనియాడారు. బహుజన వాదానికి కురిసిన తొలి చినుకు పూలే అన్నారు. గడ్డిపోచల వెన్ను తట్టి / పీడితుల జెండానెత్తిన మహనీయుడని తెలిపారు. సావిత్రీ బాయమ్మను చదివించి తొలి పంతులమ్మను చేసిన విజ్ఞాన సూర్యుడన్నారు. ఏ యుగంలో ఎవరూ బడుగుల కోసం ఇన్ని సేవలు చేసినట్టు వినలేదని చెబుతూ మానవోత్తముడి సత్యాన్ని కాలాంతకులు ఎన్నటికీ దాయలేరని తెలిపారు. సాంస్కృతిక ఆధిపత్యాలను కూల్చిన భారత విప్లవ రథసారధి పూలే అని, కాలానికి వెలుగులిచ్చిన అరుణకిరణుడని, బహుజన భానుడు, ఆధునిక బుద్ధుడు, బహుజన జాతిపిత అని సంబోధించారు. పూలే పుట్టిన రోజు భావ వాదంపై భౌతికవాదం గొర్రెగీసిన రోజని తెలిపారు.
ప్రశ్న నేరమైన చోట / ఒక పువ్వు పూసింది/ మాట్లాడడమే విషాదమైన చోట/ ఒక ధిక్కారం తలెత్తింది అని సావిత్రీబాయి జననం గురించి ఎంతో ఆలోచనాత్మకంగా రాశారు. మహిళా దార్శనికురాలు, ఉద్యమాల అడుగు, వీధికో బడిపెట్టి బీదల నొసట జ్ఞానగీతమైందని, అట్టడుగుల ఆత్మగౌరవమై, బహిష్కృతులకు బతుకు దీపమైందని చెప్పారు. సావిత్రీబాయికి భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజల హక్కుల కోసం పోరాడి బహుజనులను ఉపాధ్యాయులుగా చేసిన మహనీయులు సావిత్రీబాయి పూలే దంపతులని తెలిపారు. రాజీలేని వారి పోరాటం వెనుక దీనజనుల సంక్షేమమే లక్ష్యమన్నారు. పాలకులు, కులతత్వవాదాలు, అమానవీయాలపై , మానవ వికాసపు అవరోధాలపై వారిద్దరు ధిక్కార స్వరాలని చెప్పారు. రైతులు, వృత్తిదారులు, ప్రజలు, కార్మికులే సత్యశోధక్లో సభ్యులు, కార్యకర్తలని చెప్పి అమేయమైన ఆ విశ్వసనీయతను నిర్వచించారు. మానవీయతను ప్రేమించి, శ్రమ విలువల్ని గౌరవించే వ్యక్తిత్వం పూలే దంపతులదన్నారు. బడుగు వర్గాల ప్రజాస్వామ్య కంఠం సత్యశోధక్ సమాజమని చెప్పారు. సామాజిక న్యాయ రథసారధి జ్యోతిబాపూలే అని తెలిపారు. దాచిపెట్టినా, అణచిపెట్టినా, తొక్కిపెట్టినా, అగ్గిపెట్టినా విస్మృత వీరుల విజయగాధలు కొత్త తరానికి అంది దేశ చరిత్రకు బాటలు అవుతాయన్నారు.
పూలే వ్యక్తి కాదు బహుజన శక్తి అని జోహార్లర్పించారు. సిపాయీ తిరుగుబాటు నుండి తెలంగాణ మహోద్యమం వరకు ఎత్తిన పిడికిళ్లెవరివో, ఒరిగిన వీరులెవరో ఒక్కసారి ఆలోచించమన్నారు. ఓట్ల మాయాజాలంలో సామాజిక న్యాయానికి చెదలు పడుతున్నదని చెప్పారు. శ్రమను నమ్ముకుని ఉత్పత్తులు అందించి ఊరుకు దారులై, సంస్కృతికి శిఖరాలై మహోన్నత నాగరికతకు వారసులమైన మేం బహుజనులం, మహాజనులమని స్పష్టం చేశారు. స్వీయ అస్తిత్వం, స్వయం పోషకత్వం, బహుజన సాధికారతే పూలే వంటి మహోన్నత తాత్వికులకు అందించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. సోయితో రాజ్యాధికారమే ఆశయంగా రణభేరి నడిపి స్వతంత్ర రాజకీయశక్తిగా కదులుతామంటూ బడుగులు పిడికిళ్లెత్తితే బహుజన సూర్యోదయమేనన్నారు. పూలే అసమాన వీరుడని, సిద్ధాంతకర్త, మార్గదర్శి అని కొనియాడారు. మహాత్మ అన్న పూలే బిరుదు ప్రజల గుండెల్లో పొంగిన ఆప్యాయత గౌరవాలకు సాక్ష్యమని తెలిపారు. పూలే నిష్క్రమణ దుఃఖం తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ జననం జనానికి ఒక మహా ఓదార్పు అన్నారు. అంబేద్కర్ తన శూద్రులెవరు గ్రంథాన్ని పూలేకు అంకితమిచ్చి ఆ అడుగు జాడల్లో నడిచారని తెలిపారు. నవ సమాజ నిర్మాణం, బహుజన సాంస్కృతిక వికాసానికి రూపంగా పూలేను ఈ దీర్ఘ కవితలో కవి స్పష్టతతో ఆవిష్కరించారు. పూలే ఆశయ సాధనకై, స్వయం గౌరవానికై తమ గుండెల్ని రగల్ జెండాలు చేస్తామంటూ కావ్య నివాళి అర్పించి ముగింపు పలికారు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764