– బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు గొప్ప కవి, ప్రజాప్రతినిధి అని, తెలంగాణ మాండలికాన్ని ఎగతాళి చేసిన వారికి తన శక్తివంతమైన కవితల ద్వారా తగిన సమాధానం ఇచ్చారని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ పేర్కొన్నారు. ఖైరతాబాద్లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ 112వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి తదితరులు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆంధ్ర మహాసభ కార్యకలాపాలతో ఆయన గ్రంథాలయోద్యమంలో చురుకుగా పనిచేశారని, అలాగే శాసనమండలి సభ్యునిగా కూడా సేవలందించారని నిరంజన్ గుర్తు చేశారు. ఆయన రాసిన నా గొడవ పుస్తకం ఎంతో ప్రజాదరణ పొందిందని, ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అనే ఆయన ప్రసిద్ధ నినాదం నేటికీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోందని అన్నారు. కార్యక్రమంలో కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్.సునీత, రీసెర్చ్ అసోసియేట్ లక్ష్మీనారాయణ, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




