హీట్ వేవ్ పై రాష్ట్రమంతా అప్రమత్తత

 

*ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత‌
*వ‌డ‌గాల్పుల‌తో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత‌
*మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్షల చొప్పున న‌ష్టప‌రిహారం
*రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రత‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష

హైదరాబాద్: ఎండ‌ల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమ‌త్తంగా ఉండాల‌ని ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. వొచ్చే మూడు రోజుల్లో వ‌డ‌గాల్పుల ప్రభావం మ‌రింత పెర‌గ‌నుంద‌ని ఐఎండీ హెచ్చరిక‌ల నేప‌ధ్యంలో జిల్లా క‌లెక్టర్లు మ‌రింత అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి శ‌నివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించి, ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యంతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జిల్లాల క‌లెక్టర్ల నివేదిక ప్రకారం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో న‌లుగురు, వ‌రంగ‌ల్ అర్బన్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున జోగులాంబ గ‌ద్వాల్‌, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఏడు జిల్లాల్లో 16 మంది వ‌డ‌దెబ్బతో మృతి చెందార‌ని అధికారులు మంత్రిగారి దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిపై మంత్రి  స్పందిస్తూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సూచన మేరకు వ‌డదెబ్బ మృతు కుటుంబాల‌కు నాలుగు లక్షల రూపాయిల చొప్పున న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని ఇందుకు సంబంధించిన ప్రక్రియ‌ను త్వరిత గ‌తిన పూర్తిచేయాల‌ని ఆదేశించారు.

ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంటోంది. తీవ్రస్థాయి ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలని మీడియా, సోషల్ మీడియా, గ్రామస్థాయి ప్రకటనల ద్వారా ఎండలపై అప్రమత్తత కల్పించాలని ప్రజలకు అవసరమైన సమాచారం ప్రతి గంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని అని అధికారులను ఆదేశించారు.

బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఒక్క ప్రాణం కూడా ఎండల కారణంగా ప్రమాదంలో పడకూడదని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, రోడ్లపై పనిచేసే కార్మికులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి జిల్లా కలెక్టర్ హీట్ వేవ్ పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని మండల స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకు అందరూ ఫీల్డ్‌లో ఉండాలని ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

మనుషుల ప్రాణాలతో పాటు జీవరాశుల సంరక్షణ కూడా మన బాధ్యతేనని గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా పక్షులు, జంతువులకు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కోరారు.

వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈనెల 26వ‌ర‌కు కరీంనగర్‌, పెద్దప‌ల్లి, జయశంకర్ భూపాలపల్లి,ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత, తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు వడగాల్పులు కొనసాగుతాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింద‌ని ఈ జిల్లాల క‌లెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *