ఎయిర్పోర్టులో స్వాగతించిన మల్రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వొచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. మల్రెడ్డి రంగారెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా.. ఈసారి నాలుగు రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.





