– కేసుల ఎత్తివేతపై కదలిక లేని ఉత్తర్వులు
– ఇలాగే వ్యవహరిస్తే మళ్లీ ఆందోళనలు
– న్యాయసాయం కోసం సాక్షి ఆన్లైన్ ప్లాట్ఫాం ప్రారంభం
– కాక్రోచ్ జనతా పార్టీ నేతల వెల్లడి
న్యూదిల్లీ, జూలై 27 : నిరసనకారులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయని, కేసుల ఉపసంహరణనపై కేంద్రం తమకు ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆరోపించింది. దేశవ్యాప్త నిరసనలు మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ తన నిరసనను విరమించింది. కేంద్రంతో చర్చల సమయంలో విద్యార్థులపై కేసులు ఎత్తివేతపై కేంద్రం అంగీకరించిందని సీజేపీ చెబుతోంది. కేసులు విత్ డ్రా చేయకుపోతే మంగళవారం నుంచి మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించింది. నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేయాలని, వలంటీర్లపై నిఘా, వేధింపులను ఆపాలని సీజేపీ డిమాండ్ చేసింది. నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తోదని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ‘ఎక్స్’లో ఆరోపించారు. బీహార్, బెంగాల్లలో వందలాది విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారని, దిల్లీ, ఇతర రాష్ట్రాల్లో వందలాదిమందిపై నిఘా ఉంచి వేధిస్తున్నారని, నిరసనకారులకు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించిన వలంటర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల్లో చిక్కుకున్న విద్యార్థుల న్యాయసహాయం కోసం ‘సాక్షి‘ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రారంభించినట్లు సీజేపీ ప్రకటించింది. తమకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవట్లేదని ఆరోపించారు. పేపర్ లీక్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన చేపట్టిన ఆందోళనకారులపై నమోదైన కేసులు ఉపసంహరించు కుంటామని కేంద్ర మంత్రులు తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అందువల్లే తాము నిరసనలు నిలిపివేశామన్నారు. కానీ, ఇంతవరకూ విద్యార్థులు, ఇతర నిరసనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయలేదని తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ కేసుల గురించి న్యాయవాదులను సంప్రదిస్తున్నామని సౌరవ్ పేర్కొన్నారు. తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేంద్రానికి మరోసారి గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా దేశవ్యాప్తంగా ఆందోళన కారులపై నమోదైన అన్ని కేసులు ఉపసంహరించు కోవాలని.. నిర్బంధంలో ఉన్న నిరసనకారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మరియు బీజేపీ పాలిత లేదా బీజేపీ దిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదా పోలీసు బలగాలు కొత్త కేసులు నమోదు చేయకూడదని సీజేపీ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మళ్లీ నిరసనలో కూర్చుంటామని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. కేసులు ఎత్తేస్తామనే హామీని లిఖితపూర్వకంగా తమకు బుధవారం లోగా ఇవ్వాలని సీజేపీ కోరింది. సోమవారం సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది, ఎస్పీ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించిన తర్వాత 25న ఆందోళనను విరమించుకున్నామని, అయితే ఆందోళన తగ్గుముఖం పట్టిన కొద్దీ విద్యార్థులను ఒక్కొక్కరిగా లక్ష్యంగా చేసుకుంటారని తాము ముందే ఊహించామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




