– న్యాయపరమైన పోరాటానికి సిద్దం అవుతున్న ప్రభుత్వం
– న్యాయ కోవిదులతో చర్చించి అప్పీల్ చేసే అవకాశం
– హైడ్రాను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా చీఫ్ ఎ.వి.రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకుమద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ను న్యూదిల్లీ పంపించారు. అలాగే గతంలో కోర్టు ధిక్కారణ పిటిషన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత.. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లాలని యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై సోమవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రంగనాథ్ను తొలగించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని పేర్కొంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని అభిప్రాయపడింది. ఆయన్ని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఇదిలావుంటే కోర్టు ఆదేశాలను ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు స్వాగతించాయి. హైడ్రాను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. హైడ్రాను నిషేధిస్తే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని ఆ పార్టీ చీఫ్ రామచందర్ రావు అన్నారు. హైకోర్టు ఆదేశం ఆయన స్పందించారు. రంగనాథ్ను బలిపశువు చేశారని చెప్పారు. రేవంత్, ఎంఐఎం కనుసన్నల్లో హైడ్రా నడిచిందని విమర్శించారు. ఫాతిమా కాలేజీ, బడాబాబుల జోలికి హైడ్రా వెళ్లడంలేదని గుర్తు చేశారు. తొలి నుంచి పేదల ఇళ్లే హైడ్రా టార్గెట్ చేసిందని మండిపడ్డారు. హైడ్రాను రద్దు చేయాలని సర్కార్ను ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు