రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్
కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు ఈ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ గణతంత్ర దినోత్సవం పండుగను నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు నివాళులర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారు. కనీసం రాజ్యంగాన్ని చదివిన పాపానపోలేదు.
రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాం నుంచి రాజ్యాంగాన్ని అవహేళన చేసి, పౌరహక్కులను అణచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో రాజ్యాంగాన్ని కాలరాసి, అధికార దుర్వినియోగం చేసి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టారు. మీసా చట్టం కింద అనేక మంది రాజకీయ నేతలను అన్యాయంగా అరెస్టు చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ, వెంకయ్యనాయుడు, ఆచార్య కృపలానీ లాంటి అనేక మంది నాయకులను జైలులో పెట్టారు. మీసా చట్టం కింద దేశాన్ని జైలుగా మార్చి పౌర హక్కులను కాలరాసి, పత్రికాస్వేచ్ఛను హరించి రాష్ట్రీయ స్వయంసేవక్ లాంటి సంస్థలను నిషేధించారు.
బాబా సాహెబ్ ప్రసాదించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సంవిధాన్ గౌరవ అభియాన్గా నిర్వహించుకుంటున్నాం. మదర్ ఆఫ్ డెమొక్రసీ ఈ దేశంలో ఉంది. మన చుట్టపక్కల అనేక దేశాలు పౌర హక్కులను అమలు చేసే విషయంలో విఫలమయ్యాయి. అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా ఆ దిశలో ప్రయాణం చేసి ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను రద్దు చేసే ప్రయత్నం చేశారు. 1977లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి, జనతా పార్టీని గెలిపించి, రాజ్యాంగానికి మద్దతు పలికారు. హమారా సంవిధాన్.. హమారా స్వాభిమాన్ అనే ఆలోచనతో ప్రతి భారతీయుడు, ప్రతి బిజెపి కార్యకర్త ముందుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ నాయకుల అర్థం పర్థం లేని విమర్శలకు, తాటాకు చప్పుళ్లకు భయపడాల్సిన అవసరం లేదు అని కిషన్ రెడ్డి అన్నారు. మనసావాచా భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. అనేక రకాలుగా రాజ్యాంగాన్ని అవమానిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత దళితహక్కులను కాపాడుకుంటూ, బలహీనవర్గాలకు రాజ్యాంగబద్దమైన బీసీ కమిషన్ ను ఏర్పర్చిన ఘనత దక్కిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ జమ్ముకశ్శీర్ లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనేక సంవత్సరాలు అమలు చేయలేదు. జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఆర్టికల్ 370ని తొలగించి, భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన చరిత్ర నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. దేశ ప్రజలకు ఎటువంటి హక్కులు, అధికారాలు ఉన్నాయో, ఈరోజు జమ్మూ కశ్మీర్ లోని ప్రజలకు అమలుకు నోచుకున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరుగుదొడ్లు, వంటగ్యాస్ కనెక్షన్, మన్ రేగా నిధులు, రైతులకు గిట్టుబాటు ధర.. ఇలా అందరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది. మేం వోట్లు కోసం సంక్షేమ పథకాలు తీసుకురాలేదు.
2047లో దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. . డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జీవితానికి, కృషికి సంబంధించిన ఐదు ప్రాముఖ్యమైన స్థలాలను ‘‘అంబేద్కర్ పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారని మహూలోని అంబేద్కర్ జన్మస్థలం, శిక్షాభ్యాస భూమి, చైత్యభూమి – ముంబై (సమాధి స్థలం), దీక్షాభూమి – నాగ్పూర్, ఢిల్లీలోని అలిపూర్ రోడ్ లో ఉన్న నివాసాన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచ ప్రజలంతా ఈ పంచతీర్థాలను వొచ్చి చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అన్ని రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. అందుకోసం తెలంగాణ ప్రజలు ప్రతిఒక్కరు ముందుకురావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.





