78 మంది ఖైదీలు ఎస్‌.ఎస్‌.సి ఉత్తీర్ణత

– తెలంగాణ‌లో మొద‌టిసారి
– ప్రత్యేక రిమిషన్ ప్రకటించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 12:  ఖైదీల విద్య, పునరావాసం మరియు సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా  చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక ముందడుగు పడింది. ఖైదీలు తమ విద్యను కొనసాగించి ఎస్సెస్సీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్‌)తో అవగాహన ఒప్పందం  కుదుర్చుకుంది. అనంతరం సెంట్రల్ ప్రిజన్, చర్లపల్లి, సెంట్రల్ ప్రిజన్, నిజామాబాద్, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ నుంచి మొత్తం 108మంది ఖైదీలు 10వ తరగతిలో నమోదు చేసుకున్నారు. ఖైదీల చదువుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు, అవసరమైన చోట అదనంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా నియమించారు. వీరి వేతనాలను జైళ్ల శాఖ భరించింది. సంబంధిత జైళ్లలోని అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల చదువును నిరంతరం పర్యవేక్షిస్తూ, మార్గనిర్దేశం చేశారు. ఒక సంవత్సరంపాటు క్రమబద్ధమైన విద్యా ప్రణాళికలో భాగంగా రెగ్యులర్ తరగతులు, మాక్ టెస్టులు, ప్రీ-బోర్డ్ పరీక్షలు నిర్వహించి ఎన్ఐఓఎస్ ఎస్సెస్సీ పరీక్షలకు ఖైదీలను సిద్ధం చేశారు. ఈ నిరంతర కృషి ఫలితంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 78 మంది ఖైదీలు ఎస్సెస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. సెంట్రల్ ప్రిజన్, చర్లపల్లి –56 మంది , సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్-15 మంది, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ – 7 మంది ఖైదీలకు సులభంగా అర్థమయ్యేలా, భవిష్యత్తులో ఉపాధి, జీవనోపాధికి ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాలను ఎంపిక చేశారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌,  నైపుణ్యాలకు సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ ఎఎంపీ; కరెక్షనల్ సర్వీసెస్ డా. సౌమ్య మిశ్రా విజయవంతంగా ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధించిన ఖైదీలకు ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. ఈ ఫలితాలను వారి విద్యా ప్రయాణం, స్వీయాభివృద్ధి, పునరావాసంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ఖైదీలు చూపిన పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం మరియు ప్రతికూల  పరిస్థితులను అధిగమించాలనే సంకల్పాన్ని డీజీ ప్రత్యేకంగా ప్రశంసించారు. తమ జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పానికి ఈ విజయం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఇదే పట్టుదలతో భవిష్యత్తులో కూడా విద్యను కొనసాగిస్తూ, తమకు, తమ కుటుంబాలకు గౌరవప్రదమైన, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఖైదీలు తమ అనుభవాలను పంచుకున్నారు. విద్య లేకపోవడం వల్ల తమ జీవితాల్లో ఎదురైన ఇబ్బందులను వారు వివరించారు. చదువు లేకపోవడం కారణంగా ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందని, సమాజంలో తగిన గౌరవం లభించలేదని కొందరు తెలిపారు. ఒక ఖైదీ భవిష్యత్తులో ఎల్ ఎల్‌బీ వరకు చదివి న్యాయవాదిగా మారి, పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మరో ఖైదీ తన చిన్ననాటి నుంచే సరైన విద్య అందించి ఉంటే తన జీవితం మరోలా ఉండేదని, తాను జైలుకు వచ్చే పరిస్థితి ఏర్పడి ఉండకపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఖైదీలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో సహకరిస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ ఐఓఎస్‌) కు కూడా సౌమ్య మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మాజీ ఎన్ ఐఓఎస్‌ రీజినల్ డైరెక్టర్  పరంప్రీత్ సింగ్, ఎన్ ఐఓఎస్‌ రీజినల్ డైరెక్టర్ డా. ప్రవీణ్ చౌహాన్ అందిస్తున్న నిరంతర సహకారాన్ని ఆమె అభినందించారు.  విద్యపై ఖైదీలు చూపిన కష్టపడి పనిచేసే తత్వం, క్రమశిక్షణ మరియు నిబద్ధతకు గుర్తింపుగా, ఎన్ ఐఓఎస్‌ ద్వారా ఎస్సెస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఖైదీలందరికీ డైరెక్టర్ జనరల్ రిమిషన్ ను ప్రత్యేక ప్రోత్సాహకంగా ప్రకటించారు. విద్య, స్వీయాభివృద్ధి, పునరావాసం దిశగా ముందుకు సాగుతున్న ఇతర ఖైదీలకు కూడా ఇది ప్రేరణగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ విజయంతో ప్రోత్సాహం పొందిన తెలంగాణ జైళ్ల శాఖ, ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన ఖైదీలను ఎన్ ఐఓఎస్  ద్వారా సీనియర్ సెకండరీ (10+2) విద్యను కొనసాగించేలా ప్రోత్సహించనుంది. అదే సమయంలో మరో 47 మంది ఖైదీలు తాజాగా ఎస్సెస్సీ విద్యలో నమోదు చేసుకున్నారు. ఇది జైళ్లలో విద్యను కొనసాగించాలనే ఖైదీల ఆసక్తి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. 10+2 పూర్తి చేసిన అనంతరం వారు చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్‌లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా అండర్‌గ్రాడ్యుయేట్ బీఏ కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంటుంది.ఈ కార్యక్రమానికి శ్రీ పరంప్రీత్ సింగ్, జాయింట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ ఎన్ ఐఓఎస్‌.  డా. ప్రవీణ్ చౌహాన్, రీజినల్ డైరెక్టర్, ఎన్ ఐఓఎస్‌, హైదరాబాద్;  వై.రాజేష్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్; డా. డి.శ్రీనివాస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, హైదరాబాద్ రేంజ్ ఎం.సంపత్,  డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, వరంగల్ రేంజ్ జి.ప్రమోద్, సూపరింటెండెంట్, సెంట్రల్ ప్రిజన్, చర్లపల్లి డి.భరత్, సూపరింటెండెంట్, ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ లక్ష్మీ శ్రీనాథ్, సూపరింటెండెంట్, ఎస్‌పీడ‌బ్ల్యు హైదరాబాద్ పి.అశోక్ కుమార్, సూపరింటెండెంట్, సెంట్రల్ ప్రిజన్, నిజామాబాద్, ఇతర సీనియర్ జైలు అధికారులు, ఎన్ఐఓఎస్‌ ప్రతినిధులు,ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *