- బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
- స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికె శివకుమార్, తదితర పార్టీ నాయకులు
బెంగళూరు, సెప్టెంబర్ 30 : కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో యాత్ర 23వ రోజు శుక్రవారం మొదటిసారిగా బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటకలోకి ప్రవేశించింది. ఆయనకు కర్నాటక రాష్ట్ర సరిహద్దు వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. గుండ్లుపేట్ దగ్గరున్న ఊటీ-కాలికట్ జంక్షన్ నుంచి శుక్రవారం పాదయాత్ర ప్రారంభమైంది. గుండ్లుపేట్ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్న భారీ ర్యాలీతో ముందుకు సాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ…భారత్ జోడో పాదయాత్ర భారతదేశ శక్తికి ప్రతీక అని అన్నారు. ఈ యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా..కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగుతుందని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. కాగా గుండ్లుపేట్ జాతీయ రహదారిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చుసిన పోస్టర్లు చించి వేయడంపై బిజెపి నాయకులపై సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇట్లాగే తమ పార్టీ పోస్టర్లను చించివేస్తే బిజెపి నాయకులు స్వేచ్ఛగా తిరుగ లేరని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
కర్నాటకలో 7 జిల్లాల మీదుగా 500 కిమీ మేర సాగనున్న యాత్ర
నేటి నుండి కర్నాటక రాష్ట్రంలో ప్రారంభమయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 21 రోజులపాటు 7 జిల్లాల మీదుగా 500 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మరో 6 నెలల్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా యాత్రకు మరింత ప్రాధాన్యత చేకూరింది. యాత్రతో పార్టీకి ఎన్నికల సందర్భంగా మరింత బలం చేకూరుతుందని నేతలు ఆశాభావంతో ఉన్నారు. శుక్రవారం ఉదయం చామరాజునగర్ జిల్లా గుండ్లుపేట్లో కర్నాటక రాష్ట్రంలో ప్రవేశించిన యాత్ర మైసూరు, మాండ్యా, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి మరియు రాయచూర్ జిలాల మీదుగా సాగి 7 లోక్సభ నియోజక వర్గాలను, 22 అసెంబ్లీ నియోజక వర్గాలను కవర్ చేస్తూ తెలంగాణలో ప్రవేశించనుంది. కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం గుండ్లుపేట్, మైసూరు మరియు బళ్లారిలలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.