- సర్కార్ దవాఖానలోనే అన్ని పరీక్షలు
- సర్కార్ దవాఖానల్లో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలె
- జంట నగరాల్లో అదనంగా మరో 10 రేడియాలజీ ల్యాబ్లు
- సిద్ధిపేట సర్వజన దవాఖానలో రేడియాలజీ హబ్ను ప్రారంభించిన మంత్రి హరీష్రావు
- మా తండ్రివయ్యా: హరీష్తో విఠలాపూర్ వృద్ధురాలు
- అభ్యర్థులకు అన్నం వడ్డించిన మంత్రి హరీష్రావు.. ఖుషీ అయిన నిరుద్యోగ అభ్యర్థులు
సిద్ధిపేట, మే 24 (ప్రజాతంత్ర బ్యూరో): దేశంలోనే ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేననీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేటలోని జిల్లా ప్రభుత్వ సర్వజన దవాఖానలో రేడియాలజీ హబ్ను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మతో కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ దవాఖానలలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా సిఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి జిల్లా దవాఖానాలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి పిహెచ్సి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వొచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామనీ, పిహెచ్సిలకు వొచ్చే రోగులు కొంత మంది గుండెనొప్పితో వొస్తే ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మెమెగ్రఫీ సేవలు అవసరాలకు అనుగుణంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామనీ, అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ప్రభుత్వ దవాఖానలలో ఉండేలా తెస్తున్నామనీ, హైదరాబాద్ జంట నగరాలలో అదనంగా మరో 10 రేడియాలజీ ల్యాబ్లు ప్రారంభిస్తున్నామన్నామన్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానలలో పరీక్షల కోసం వెళ్లితే ప్రైవేట్ ల్యాబ్లకు రాసేవారనీ, కానీ తెలంగాణ ప్రభుత్వం వొచ్చాక పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు.
ప్రజలు ప్రయివేటు దవాఖానకు, ప్రయివేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దనీ, ఏ వైద్య పరీక్ష కావాలన్నా..ప్రభుత్వ దవాఖానలోనే చేస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా దవాఖానలు ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానలలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలనీ, అన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానలలో స్టెమీ కార్యక్రమం ద్వారా 40 వేల రూపాయల విలువ కలిగిన ఇంజక్షన్ ఇస్తూ..గుండెపోటు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామనీ, అన్నీ జిల్లాలో స్టెమీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 70 ఏళ్లలో కేవలం 3 కళాశాలలు వొస్తే.. ఏడేండ్ల టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు. సిఎం కేసీఆర్ నేతృత్వంలో 33జిల్లాలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామనీ, రాష్ట్రంలోని 8 చోట్ల మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు ప్రారంభం చేయనున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 700 మెడికల్ కళాశాల సీట్లు ఉండేవనీ, ఈ 7 ఏండ్లలో 2840 మెడికల్ కళాశాల సీట్లు పెరిగాయనీ, రాబోయే రెండేళ్లలో 5240 మెడికల్ సీట్లు పెంపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, వైస్ ఛైర్మన్ కనకరాజు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి, ఇంచార్జి డిఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
కంటి సమస్యలుంటే రంది పడొద్దు… సిద్ధిపేటలో మీ కోసమే కంటి దవాఖాన
కంటి సమస్యలుంటే రంది పడొద్దు. మీ కోసమే సిద్ధిపేటలో కంటి దవాఖాన తెచ్చిన. ఇక్కడ ఉన్న సౌలత్లన్నీ మీ ఊర్లో క్యాంపు నిర్వహణ సమయంలో అందరికీ చెప్పండి. నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో నిత్యం కంటి పరీక్ష క్యాంపు నిర్వహణ ఉంటుంది. సిద్ధిపేట ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వైద్య సేవలు, సౌలత్లు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ కంటి సమస్యలకు పరిష్కారం అందుతున్న సేవల గురించి మీ ఊర్లో అందరికీ తెలిసేలా మీరు చెప్పాలి. మీ ఊర్లో తెలిస్తే అందరికీ కంటి పరీక్షలు ఉచితంగా చేయించాలన్నదే నా తాపత్రయం. సిద్ధిపేట నియోజకవర్గంలో క్యాట్రాక్ట్ కంటి సమస్య ఉన్న ఒక్క రోగి ఉండొద్దు అనేదే నా తపన అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో కంటి సమస్యలతో బాధపడుతూ..పరీక్షలు చేయించుకుంటున్న రోగులను ఒక్కొక్కరినీ మీరెక్కడి నుంచి వొచ్చారని ఆరా తీస్తూ.. యోగక్షేమాలు అడుగుతూ ఆప్యాయంగా పలకరించారు. కంటి చూపుతో బాధపడే మిగిలిన వారిని ఇక్కడికి తోలుక రావాలని కంటి సమస్యలతో వొచ్చిన రోగులను ఆరోగ్య మంత్రి కోరారు. ఓ రోగి లచ్చవ్వ బిపి, షుగర్ కారణంగా కంటి ఆపరేషన్ చేయలేదని మంత్రి దృష్టికి తేగా రంది పడొద్దు లచ్చవ్వ అంటూ భుజం తట్టి నీకు కావాల్సిన మందులు ఇప్పించి, నీకు కంటి ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పక్కనే కంటి ఆపరేషన్ చేయించుకున్న వృద్ధురాలి వద్దకు వెళ్లి భుజం తట్టి ఆప్యాయతతో అవ్వ నేనెవరినీ అని ఆరా తీస్తూ..యోగక్షేమాలు అడిగి తెలుసుకోగా..మా తండ్రివయ్యా హరీష్రావు నువ్వనీ విఠలాపూర్ గ్రామ అవ్వ బదులిచ్చింది.
నీకు మంచిగ చూశారా.. లేదా.. ఇక నుంచి నీకు కండ్లు మంచిగ కనపడతాయని.. మీ ఊరు నుంచే కంటి పరీక్షలు మొదలు పెట్టామని మంత్రి చెప్పుకొచ్చారు. సిద్ధిపేట నియోజకవర్గంలో క్యాటరాక్ట్ కంటి సమస్యలు వంద శాతం పరిష్కారం చేయాలన్నదే లక్ష్యంగా చేసుకుని ఉన్నట్లు వైద్యులకు సూచించారు. ఒక్కొక్కరికీ కంటి పరీక్ష, ఆపరేషన్కై 18 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఖర్చు వొస్తుందనీ, రూపాయి ఖర్చు లేకుండా గ్రామంలో క్యాంపు నిర్వహించి ఉచితంగా కంటి సమస్యలతో బాధపడే రోగులకు వైద్యం, కావాల్సిన కళ్ల అద్దాలు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 123 యూనిట్లు పూర్తి చేసే దిశగా, 8 వేల నుంచి 10 వేల వరకూ కంటి సమస్యతో బాధపడే రోగులు ఉన్నట్లు అంచనా ఉన్నదని, రోజూ వారీగా 15 నుంచి 20 మంది వొస్తారని, వారందరికీ కంటి పరీక్షలు జరిపి కావాల్సిన ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.
నిత్యం ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ జరపాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్కు సూచించారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ మండలంలోని మల్యాలలోని 17 కంటి రోగులకు 9 మందికి క్యాట్రాక్ట్ సర్జరీ చేసినట్లు, 4 రోగులకు సర్జరీ చేయలేమని, 3 కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు, అలాగే విఠలాపూర్ గ్రామంలోని 44 మంది కంటి రోగులకు 29 మందికి క్యాటరాక్ట్ సర్జరీ చేసినట్లు, 12 మంది రోగులకు సర్జరీ చేయలేమని, 3 కంటి అద్దాలు ఇవ్వనున్నామని, అలాగే చంద్లాపూర్లోని 18 మంది కంటి రోగులకు పరీక్షలు మొదలుపెట్టామని, మొత్తం 79 మంది కంటి రోగులకు 38 మందికి సర్జరీ చేయగా, 16 మందికి సర్జరీతో అవసరం లేదని, మరో 6 మందికి కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రి హరీష్రావు వివరించారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 80 మంది వరకూ దవాఖానకు వొస్తున్నారని, మరో ఆపరేషన్ థియోటర్ అవసరంపై మంత్రి దృష్టికితేగా ఏర్పాటు చేయించేలా చొరవ చూపాలని ఎల్వీ ప్రసాద్ మేనేజ్మెంటు విభాగాధిపతికి ఫోన్ లైనులో సూచించారు. ఈ మేరకు ల్యాబ్లో కంటి సమస్యలతో బాధపడే రోగులకు చేస్తున్న చికిత్స విధానం పరిశీలించారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రోజాశర్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నేతలు ఉన్నారు.
అభ్యర్థులకు అన్నం వడ్డించిన మంత్రి హరీష్రావు.. ఖుషీ అయిన నిరుద్యోగ అభ్యర్థులు
శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్రావు స్వయంగా అన్నం వడ్డించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని బాబు జగ్జీవన్రామ్ భవన్లో గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఉచిత పోలీసు కానిస్టేబుల్ శిక్షణను మంత్రి హరీష్రావు ఇప్పిస్తున్నారు. వీరికి మధ్యాహ్న సమయంలో ఉచితంగా అన్నం కూడా ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో మంత్రి హరీష్రావు మంగళవారం లంచ్టైంలో బాబు జగ్జీవన్రామ్ భవన్కు వెళ్లి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణను తీసుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులకు అన్నం వడ్డించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి హరీష్రావే స్వయంగా అన్నం వడ్డించడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఖుషీ అయ్యారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రోజాశర్మ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే, సిద్ధిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బిసి వసతిగృహ విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా స్థాయి వేసవి సంస్కృతిక (సమ్మర్ కార్ణివాల్) పోటీలు 2022నకు మంత్రి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ, దేశభక్తి గేయాల నృత్యాలను తిలకించి ప్రశంసా పత్రాలను అందజేశారు.