దేశ వ్యాప్తంగా… కార్మిక సంఘాల మొదటి రోజు సమ్మె విజయవంతం

  • ఊరూ వాడా ధర్నాలు…మూతపడ్డ పలు ప్రభుత్వ కార్యాలయాలు
  • సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, ‌కార్మిక సంఘాలు
  • మద్దతుగా రాజకీయ పార్టీల ర్యాలీలు
  • విద్యార్థి, కార్మిక సంఘాల ఆందోళనతో కొన్ని చోట్ల ఉద్రిక్తత
  • సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…ఆగిన కార్యకలపాలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగానూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కార్మిక, కర్షక సంఘాల తొలి రోజు సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక రెండు రోజులు సోమ, మంగళవారం ‘భారత్‌ ‌బంద్‌’‌కు పిలుపునిచ్చిన విషయం విధితమే. అందులో భాగంగా తొలి రోజు ఊరూ వాడా ధర్నాలు, రాస్తారోకోలు, కార్మిక సంఘాలకు మద్ధతుగా రాజకీయ పార్టీల ర్యాలీలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగానూ సమ్మె కొనసాగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఖమ్మం బస్‌ ‌డిపో ముందు వామపక్ష పార్టీల నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు. అలాగే కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు.

మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మణుగూరులో ఆర్టీసి, మున్సిపాల్టీ, సింగరేణిపై సమ్మె ప్రభావం కనిపించింది. సమ్మెలో పాల్గొన్నాయి పలు కార్మిక సంఘాలు. సింగరేణిలో 50 శాతం ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు సిద్దిపేట పట్టణంలో కేంద ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బైక్‌ ‌ర్యాలీ నిర్వహించాయి కార్మిక సంఘాలు. ఆదిలాబాద్‌లో బ్యాంకు ఆఫ్‌ ‌మహారాష్ట్ర ముందు ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పటాన్‌ ‌చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పటాన్‌ ‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ‌సంస్థలకు తొత్తులుగా మారి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగింది. హనుమకొండలో కార్మికుల నిరసనకు ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ ‌మద్దతు తెలిపారు. పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి ఇంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతునే ఉంటాయని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు తగ్గించాలని, ఒప్పంద కార్మికులకు 25 వేల రూపాయలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. కొత్త లేబర్‌ ‌కోడ్‌ ‌విధానం ద్వారా కార్మిక హక్కులను హరించవద్దని, 10వ వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి… ఆగిన కార్యకలపాలు
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన క్రమంలో సింగరేణిలో కార్మికుల సమ్మె కొనసాగింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొంటున్నారు సింగరేణి కార్మికులు. సింగరేణి 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ ‌చేశారు. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు బావులన్నీ బోసిపోయాయి. చిర్యాల జిల్లా, శ్రీరాంపూర్‌, ‌మందమర్రి, బెల్లంపల్లి డివిజన్‌ ‌లో ఉదయం నుంచే సింగరేణి సమ్మె జరిగింది. సార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌ ‌పాటించారు. ఆర్కే 7 వద్ద నాలుగు జాతీయ కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా రామగుండం రీజియన్‌లో కార్మికుల సమ్మె కొనసాగింది. ఆరు బొగ్గుగనులు, నాలుగు ఓపెన్‌ ‌కాస్ట్ ‌గనుల్లో మొదటి షిప్ట్ ‌లోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు.

దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయ ఏర్పడింది. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్ముకుంటుందని కార్మిక నేతలు మండిపడ్డారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయాలని చేస్తుందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రయివేటికరణను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శ్రీరాంపూర్‌ ఏరియా బస్‌ ‌స్టాండ్‌ ‌వద్ద రాస్తారోకో నిర్వహించారు జాతీయ కార్మిక సంఘాల నాయకులు. సింగరేణి కార్మికుల రాస్తారోకో వల్ల వాహనాల రాకపోకలు చాలాసేపు స్తంభించిపోయాయి. పెద్దపల్లి జిల్లా ఓసిపి 5 వద్ద లారీలను సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. జిడికె 2వ బొగ్గుగనిపై ఐఎఫ్‌టియూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

దేశవ్యాప్తంగా మూతపడ్డ పలు ప్రభుత్వ కార్యాలయాలు…స్తంభించిన బ్యాంకింగ్‌ ‌కార్యకలాపాలు
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలకు చెందిన సంయుక్త ఫోరమ్‌ ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మొదటిరోజు సోమవారం బ్యాంక్‌ ఉద్యోగులు, ఇతర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది అధికారిక, అనధికారిక కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని ఆల్‌ ఇం‌డియన్‌ ‌ట్రేడ్‌ ‌యూనియన్‌ ‌కాంగ్రెస్‌ ‌జనరల్‌ ‌సెక్రటరీ అమర్జీత్‌ ‌కౌర్‌ ‌తెలిపారు. జార్ఖండ్‌, ‌చత్తీస్‌ఘర్‌, ‌మధ్యప్రదేశ్‌లోని మొత్తం కోల్‌ ‌మైనింగ్‌ ‌బెల్ట్‌లోని కార్మికులు నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు.

దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను, బ్యాంకింగ్‌ ‌చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా బ్యాంక్‌ ‌యూనియన్లు నిరసన తెలుపుతున్నాయి. కేరళలో బంద్‌ ‌ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుండి అత్యవసర సేవలను మినహాయించారు. రైల్వే స్టేషన్స్, ‌హాస్పిటళ్లు వెళ్లే ప్రయాణికుల కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమబెంగాల్‌లో పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలువురు వామపక్ష కార్యకర్తలు కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌, ‌డుమ్‌డుమ్‌, ‌బారాసత్‌, ‌బెల్గారియా, జోరునగర్‌, ‌దోమ్‌జూర్‌ ‌ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. గోల్‌పార్క్, ‌లేక్‌ ‌టౌన్‌, ‌బగౌతియాలతో పాటు కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్భందించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకావాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లోనూ సమ్మె కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page