- కరెంటు చార్టీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం
- నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కొరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని కెసిఆర్ ప్రభుత్వం మోపిందని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని, కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమని అన్నారు. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని కేసీఆర్ ఫ్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవం దారుణమని, అట్లాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా….అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ. 12,598 కోట్లు ఉండటం మరింత దారుణమన్నారు బండి సంజయ్. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ. 4603 కోట్లు కాగా… అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవే వున్నాయని అన్నారు. ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెం••కు బిల్లులు చెల్లించడం లేదని, మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదని, కానీ ఈ లోటును పూడ్చుకునేందుకు సామాన్య ప్రజలపై ఛార్జీల పెంపు పేరుతో భారం మోపడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నిచారు. కరెంట్ ఛార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాడుతుందని, అందులో భాగంగా •నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కరెంటు ఛార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని బండి ప్రకటించారు. పేదల నుండి మధ్య తరగతి వరకు ఎవరినీ వదలకుండా ఛార్జీల పెంపుతో కరెంటు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు షాక్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్వి అబద్ధాలని కేంద్ర మంత్రి తేల్చారు
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలన్నీ అవాస్తవమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తేల్చారని బండి సంజయ్ అన్నారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ, లేదంటే సీఎం కేసీఆర్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పంజాబ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. కేంద్రం యాసగింలో వరి ధాన్యం సేకరించబోదనేది అబద్ధమనీ, వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ సేకరిస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ధాన్యం కొనుగోలులో పెద్ద స్కాం దాగుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.