నేడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
భారతదేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేత జగ్జీవన్ రామ్. అతి చిన్న వయస్సులో (27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన ప్రజానాయకుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, బాబూ జగ్జీవన్ రాం. పోలిటికల్ కింగ్ మేకర్గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసమే పనే చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. యాభై ఏళ్ళు పార్లమెంట్లో సభ్యునిగా కొనసాగిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనది.
1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రం, షాబాద్ జిల్లా, ఛాందా గ్రామంలో శిబిరం, బసంతి దేవి దంపతులకు జగ్జీవన్ జన్మించారు. ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించడంతో ఎన్నో అవమానాలను, ఛీత్కారలను ఎదుర్కొన్నారు.
చిన్ననాడే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్ల మధ్య తల్లి వసంతీదేవి సంరక్షణలో తన చదువు కొనసాగించారు. రాత్రింబవళ్ళు భోజ్పురితో పాటు హిందీ, ఇంగ్లీషు, బెంగాలి, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్, కలకత్తా విశ్వ విద్యాయం నుంచి డిస్టింక్షన్లో బిఎస్సీ డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రు డయ్యారు. పీజీ చదువు పూర్తి చేశారు.
కార్మికుల కోసం పొరాడి 35వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేకమంది జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు.
ఆయన జీవితకాలం 78 ఏళ్ళు అయితే అందులో 52 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపారు.1952లో భారత రిపబ్లిక్ తొలి లోక్సభ ప్రవేశించిన జగ్జీవన్రామ్ వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. ఏకధాటిగా 33 సంవత్సరాలు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. మొదటి శ్రేణి పార్లమెంట్ రియన్గా నిలిచారు. మంత్రి మండలిలో అతి చిన్న వయసుడ్కెన జగ్జీవన్రామ్ను అందరూ ‘బేబి మినిష్టర్’ అని పిలిచేవారు. ప్రజలంతా ప్రేమతో ‘బాబుజీ’ అని పిలిచేవారు.
వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో సేవలనందించిన ప్రగతిశీలి ఆయన. దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెయ్యటంలో కీలకపాత్ర పోషించారు. 1942లో కాంగ్రెస్ లో చేరి, జగ్జీవన్ 1969లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1977లో ఇందిరా గాంధీతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్’ పార్టీ ఏర్పాటు చేశారు.
ఇంద్రాణిదేవితో బాబుజీకి 1935 జూన్ 1న వివాహం జరిగింది. ఇంద్రాణి కూడా స్వాతంత్య్ర సమర యోధురాలు. ఆయన కుమార్తె మీరాకుమార్ తండ్రి ఆదర్శాలతోనే పెరిగి, ఆయన బాటలోనే కేంద్రమంత్రిగా, లోక్సభ స్పీకర్గా దేశానికి సేవలందించారు.
బాబుజీ గొప్ప రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లీషులో రచనలు చేశారు. ‘‘భారత దేశంలో కులం సవాళ్ళు’’, ‘‘ జీవన సరళి వ్యక్తిత్వ వికాసం’’ అను రెండు విశిష్ట గ్రంథాలను రాశారు.ఆయన గొప్ప అధ్యయనశీలి. ఉజ్జయినిలోని విక్రమ విశ్వ విద్యాయం 1967లో జగ్జీవన్రామ్కి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆయన సేవను మెచ్చిన కాన్పూర్ విశ్వవిద్యాయం 1968లో డాక్టరేట్తో సత్కరించింది. జగ్జీవన్ రామ్ అమూల్యరత్నం’’ అని గాంధీ ఒక సందర్భంలో రాశారు. 1986 జూల్కె 6వ తేదీన బాబూజీ తన తుదిశ్వాస విడిచారు.
బాబు జగ్జీవన్ రామ్ వరుసగా ప్రజాప్రతినిధిగా, భారత దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన క్యాబినెట్ మంత్రిగా రికార్డు సృష్టించారు. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా 1946 నుండి 1952 సంవత్సరం వరకు ఉన్నారు. ఆయన 1952 నుండి 1956 సంవత్సరం వరకు కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు.1956 నుండి 1962 వరకు కేంద్ర రవాణా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.1962 నుండి 1963 సంవత్సరం వరకు ఆయన కేంద్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. 1966 నుండి 1967 సంవత్సరం వరకు కేంద్ర కార్మిక, ఉపాధి మరియు పునరావాస శాఖ మంత్రిగా పని చేశారు. 1967 నుండి 1970 వరకు కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. 1970-1974, 1977 – 1979 కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు.1974 నుండి 1977 వరకు కేంద్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. సెప్టెంబర్ 1976 నుండి 1983 ఏప్రిల్ వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడిగా పని చేశారు. భారత ఉప ప్రధానమంత్రిగా, 1977 మార్చి 24 నుండి 1979 జూలై 28 వరకు విధులు నిర్వర్తించారు.
-ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్