– సీఎం రేవంత్ నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల్లాడుతూ వైఎస్ నిరుపేదలకు అందించిన సేవలు, చూపిన సంక్షేమ బాట ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘవీర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాల్గొన్నారు.
పేదల పక్షపాతి వైఎస్ : భట్టి 
డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి అని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా సిటీ సెంటర్, పంజాగుట్టలోని ఆయన విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన గొప్ప నాయకుడని, ఈ నిర్ణయం రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన అమలు చేసిన విప్లవాత్మక పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాయని భట్టి గుర్తు చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ సహాదారు షబ్బీర్ ఆలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కేక్ కట్ చేశారు. కాగా, ప్రజాభవన్లోని తన నివాసంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కూడా వైఎస్కు నివాళులర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





