– రాష్ట్ర జనాభాలో నాలుగైదు శాతం ఉన్నా విస్మరిస్తారా?
– విపక్షనేత మధుసూదనాచారి ధ్వజం
– రౌండ్ టేబుల్ సమావేశంలో 6 తీర్మానాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: విశ్వబ్రాహ్మణులు ఒక శక్తిగా ఎదగాలని, రాజ్యాధికారంలో వాటా చేజిక్కించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే ఏ కులానికైనా గుర్తింపు, మనుగడ ఉంటాయన్నారు. ఐదు వృత్తులను వేర్వేరు కులాలుగా చూపెట్టి… విశ్వకర్మ జాతి జనాభాను తక్కువ చేసి చూపెట్టడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లే అధికారాన్ని తారుమారు చేస్తున్న తరుణంలో రాష్ట్ర జనాభాలో 4-5 శాతం ఉండే విశ్వబ్రాహ్మణులు ఎన్నికల్లో కీలకంగా మారతారని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ తొలి శాసనసభాపతి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తంగెళ్లపల్లి రవి హాజరై… విశ్వబ్రాహ్మణుల కులం గుర్తింపు, ఐక్యత గురించి మాట్లాడారు. గ్లోబల్ విశ్వకర్మ ఎన్ఆర్ఐ ప్రతినిధి చైతన్య కూడా పాల్గొని… తన సామాజిక వర్గం అభ్యున్నతికి తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ముఖ్యమైన ఎజెండాగా ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదించుకున్నారు. ఇందులో ప్రధాన తీర్మానంగా ఐదు వృత్తులైనా… ఒక్కటే కులం… అదే విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల కులం అని చాటిచెప్పారు. విశ్వకర్మల వృత్తులను భావితరాలకు చాటిచెప్పేందుకు మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని, వృత్తులను పరిరక్షించాలని, ఆర్థికంగా అండగా నిలవాలని తీర్మానాలు ఆమోదించారు. చివరగా తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. పాలకులు తమ తప్పులను సరిదద్దుకోని పక్షంలో, పోరాటానికి సన్నద్ధమవ్వాలని, న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని కలిసి ఒత్తిడి చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన వక్తలంతా ముక్తకంఠంతో నినదించారు. వచ్చేనెలలో మూడో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో జర్నలిస్ట్ మరియు పారిశ్రామిక వేత్త దేవరకొండ కాళిదాస్, విశ్వకర్మ వేదిక వ్యవస్థాపకులు ఆడ్లూరి రవీంద్రా చారి, రచయితల సంఘం నుంచి గాజోజు నాగభూషణం, కుందారం గణేశాచారి, ఉపేంద్రాచారి, దుబ్బాక కిషన్రావు, ప్రముఖ ఆంకోలాజిస్ట్ డాక్టర్ చింతమడక సాయిరాం, వేదాస్ అధ్యక్షుడు కుమారస్వామి, సదాశ్రీ తదితరులు పాల్గొని విశ్వబ్రాహ్మణులు ఐకమత్యం కావాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




