– విభజన శక్తులను తిప్పికొట్టాల్సిన అవసరం ఇదే
– బెంగాల్ ప్రజలను కోరిన సిఎం మమతా బెనర్జీ
కోల్కతా,ఏప్రిల్27: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్’ (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ సంస్క•తి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని వోటర్లను కోరారు. ‘మా-మాటి-మానుష్ ఇక అంచనాలకు సంబంధించిన విషయం కాదు, కాలమే సమాధానమిస్తుంది’ అని అన్నారు. ఆదివారంనాడు తాను జరిపిన పాదయాత్రకు విశేషంగా స్పందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండో విడత ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 6 గంటలకు తెరపడనుండటంతో సామాజిక మాధ్యమం ’ఎక్స్’లో ప్రజలను ఉద్దేశించి మమతాబెనర్జీ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఐకమత్యం, సంస్క•తి, నాగరికత బెంగాల్కు గర్వకారణమని, బెంగాల్ వారసత్వాన్ని దిగజార్చాలనుకునే విభజన, విధ్వంసకర శక్తులకు రాష్ట్రంలో చోటులేదని పరోక్షంగా బీజేపీని ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నలుదిశలకు విస్తరిస్తున్న తరుణంలో ఏ దుష్టశక్తీ దానిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు బెంగాల్ ప్రజలకు రక్షణకవచమని, వీటిని అడ్డుకోవడం భూప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి, ప్రగతికి అండగా ప్రజలు నిలబడతారనే నమ్మకం తనకు ఉందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ’మన భాష, మన సంస్క•తి, గర్వించదగిన ఈ నేల వారసత్వాన్ని మనం పరిరక్షించుకోవాలి. కులం, మతం, భాష, నేపథ్యంతో సంబంధం లేకుండా ఈనెల 29న ప్రజలంతా జోరపూల్ గుర్తుకు వోటు వేసి మా-మాటి-మనుష్ అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలి’ అని మమతా బెనర్జీ కోరారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈనెల 29న జరుగనున్న తుది విడత పోలింగ్లో భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉంది. రెండు విడతలుగా నిర్వహిస్తున్న ఈ పోలింగ్లో తొలి విడత పోలింగ్ ఈనెల 23న జరిగింది. అనూహ్యంగా 93 శాతం పోలింగ్ నమోదైంది. అయితే భారీ పోలింగ్ తమకే అనుకూలమని, పోలింగ్ జరిగిన 152 నియోజకవర్గాల్లో 110 స్థానాలను తాము గెలుచుకోనున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ వాదనను టీఎంసీ తోసిపుచ్చింది. వరుసగా నాలుగోసారి టీఎంసీ అధికారంలోకి రానుందని చెప్పింది. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
