- అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
- లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది
- మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్.ఎస్ పార్టీ నేతలు సిగ్గు పడాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలనలో కట్టిన ఈ ప్రాజెక్టు వారి పాలనలోనే కుప్ప కూలిపోయిందని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీ లు ఎందుకూ పనికి రాకుండా పోయినా ఆ నిర్మాణాలు తమ గొప్పతనమని బి.ఆర్.ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదిక పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీలతో లక్ష కోట్లు రుణం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. ఇంత జరిగాక కుడా బిఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ సొంత జాగీర్ కాదని,ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే చూస్తూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎన్డిఎస్ఏ ఇచ్చిన నివేదికపై సమగ్రంగా అధ్యయనం చేసిన మీదట తదుపరి చర్యలకై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
బి.ఆర్.ఎస్ పాలనలో నిర్మితమైన ఈ ప్రాజెక్టు రైతుల కోసం నిర్మించింది ఎంత మాత్రం కాదని నాటి అధికార పార్టీ నేతలు జేబులు నింపు కోవడానికే దీనిని వినియోగించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటూమన్నారు.ఈ అంశంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని బాద్యులైన వారికి శిక్షలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన రూపకల్పన,నిర్వహణా లోపాలు బయట పడినందున బి.ఆర్.ఎస్ నేతలు తెలంగాణ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ లు నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు సృష్టింసుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం విషయంలో అనుసరించిన విధానాలు మాత్రమే దోహద పడ్డాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.