మ‌ళ్లీ టీఆర్‌ఎస్‌ ?

రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం!

( మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి )
భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే  ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌పేరు సుపరిచితం. తెలంగాణ అంటేనే టిఆర్‌ఎస్‌, ‌టిఆర్‌ఎస్‌(TRS) అం‌టే కెసిఆర్‌ అన్నది నిలిచిపోయింది. మలివిడత ఉద్యమానికి సారథ్యం వహించిన పార్టీగా ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్భవించిన టిఆర్‌ఎస్‌ ‌తన లక్ష్యాన్ని ముద్దాడింది. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు పదేళ్ళ పాటు ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించింది.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించుకోవడంతో ఇక తనకు తిరుగులేదని భావించింది. దీంతో తన చూపును దేశ రాజకీయాల వైపు మళ్ళించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర సమితిని 2022లో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌గా మార్పుచేసింది. ఈ విషయంలో పార్టీలోని అనేకులు తమ అయిష్టతను వ్యక్తం చేసినప్పటికీ పార్టీ అధినాయకత్వం వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. తెలంగాణ అంటే కేవలం ప్రాంతీయ పిలుపుగా ఉంటుందని, జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో విస్తరించాలంటే పేరు మార్పు అనివార్యమని వారికి సర్ది చెప్పింది.  జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాల్సి ఉందని, అందుకు బిజెపి, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ‌ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉందంటూ ఆ దిశగా కొంతమేర ప్రయత్నించింది. తన ఆలోచనలకు మద్దతు కూడగట్టేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆపార్టీ అధినేత కెసిఆర్‌ ‌పర్యటించారు. పక్కనున్న ఆంధప్రదేశ్‌, ‌మహారాష్ట్రలో పార్టీని విస్తరించే ప్రయత్నాలు కూడా జరిగాయి. పార్టీ ఆవిర్భావ సభను కూడా జాతీయ స్థాయిలో పేరున్న నాయకులతో ఘనంగా నిర్వహించారు. అది విపక్షాలకు ఆయుధంగా మారింది. ఇంతకాలం తెలంగాణ పార్టీగా చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌తన పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని తొలగించడం ద్వారా తన అస్థిత్వాన్నే కోల్పోయిందన్న ప్రచారం మొదలైంది. ఇంతకాలం తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకున్న టిఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఆ అర్హత లేదని కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు దుయ్యబట్టాయి.

పేరుమార్పు, పాలనా వైఫల్యాలపై ప్రతిపక్షాలు చేసేవిమర్శల ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 39 అసెంబ్లీ సీట్లు సాధించుకున్నా, పార్లమెంట్ లో మాత్రం జీరో ఫలితాలను చవిచూసింది. దీంతో తెలంగాణ ప్రజలకు కెసిఆర్‌ ‌కుటుంబంతో రుణం తీరిపోయిందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి పలు సందర్బాల్లో చెణుకులు విసురుతూవచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పేరున్న టిఆర్‌ఎస్‌ ‌గతంలో అనేక ఎన్నికల్లో విజయాలను సాధిస్తూ వొచ్చింది. కానీ బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మళ్ళీ టీఆర్‌ఎస్‌గానే పార్టీకి నామకరణం చేయాలని పట్టుపడుతున్నారు.

మొదట్లో అయిష్టత వ్యక్తంచేసిన అదినాయకత్వం కొంత మెత్తబడినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌తో సంప్రదించేందుకు సిద్దపడినట్లుకూడా వార్తలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి బిఆర్‌ఎస్‌కు మారినప్పుడు ఆపేరును మరో ఆరు ఏండ్ల వరకు ఎవరికి కేటాయించకుండా ఎన్నికల క‌మిషన్‌ ‌ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే తిరిగి పేరు మార్పుతో సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా వొస్తాయా అన్న విషయాలను పరిశీలిస్తున్నట్లు కూడా వినికిడి. స్వంత రాష్ట్రంలో గెలవకుండా దేశరాజకీయలపై దృష్టి సారించడం నేలవిడిచి సాముచేయడమే అవుతుందన్న నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఈనెల 25న పార్టీ అవిర్భావ దినోత్సవంలోనే దానిపై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page