- 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు
- సామాజిక ఆర్థిక, పర్యావరణ రంగాలపై ప్రత్యేక దృష్టి
- హైదరాబాద్ లో సమ్మిట్ జరగడం రాష్ట్రానికి గర్వకారణం
- రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: భారత సమ్మిట్ 2025 కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్ పాలనగా రుజువు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సమ్మిట్ 2025 లో 100 కు పై బడి దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. సామాజిక,ఆర్ధిక, పర్యావరణ తదితర రంగాలపై ఈ సమ్మిట్ లో అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో జరిగిన భారత సమ్మిట్-2025 సదస్సుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా అభివర్ణించారు. సామాజిక న్యాయానికి,ప్రగతిశీల విలువలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఈ సదస్సు ద్వారా వివరించామన్నారు. హైదరాబాద్ లో జరిగిన భారత సమ్మిట్ 2025 ద్వారా అంతర్జాతీయ న్యాయ సాధన వైపు అడుగులు వేయగలిగామన్నారు.
పహల్గామ్ ఘటనపై యావత్ దేశం సంఘటితంగా ఉండాలి
కాశ్మీర్ లోను పాహాల్గాం లో జరిగిన ఉగ్రదాడిని మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రలను యావత్ భారతదేశం సంఘటితంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భారత వైమానిక దళంలో పనిచేసిన అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. తాను శ్రీనగర్ సమీపంలోని అవంతి ఎయిర్ ఫీల్డ్,లడక్, సియాచిన్ గ్లేసియర్ లో పనిచేసిన ఉదంతాలను ఆయన వివరించారు. కాశ్మీర్ గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని ఇక్కడ జరిగిన దాడి హిందూ-ముస్లిం ల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకే నని ఆయన మండిపడ్డారు.
తద్వారా కాశ్మీర్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంలో భాగమే ఈ దాడులని ఆయన విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిని,వారికి తోడ్పాటునందించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది భారతీయుల ఐక్యతపై జరిగిన దాడి గా ఆయన పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ దాడిని ఖండిస్తూ ప్రత్యేక తీర్మానం ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి సమయంలో యావత్ భారతీయులు సంఘటితంగా ఉండాలని మంత్రి ఉద్బోధించారు.