తెలంగాణ రాష్ట్ర రాజకీయం 2023 ఎన్నికలతో మరో మలుపు తిరిగింది. దశాబ్దకాలం ఒక్క పార్టీ ఆధిపత్యాన్ని ముగిస్తూ, ‘ప్రజల పాలన–ప్రజలతోనే’ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ వెలువరించిన ఆరు ముఖ్య హామీలు, రాష్ట్ర పరిపాలనపై “పూర్తి పారదర్శకత” వాగ్దానం, పాత అవినీతి వ్యవస్థలను కూల్చి కొత్త పరిపాలనా సంస్కృతి నెలకొల్పుతామన్న సంకల్పం—ఈ అన్నింటి మధ్య ప్రజల్లో అపారమైన ఆశలు పెరిగాయి. రెండు సంవత్సరాలు గడిచిన ఈ సమయంలో ప్రభుత్వం వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చింది, ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు నిలబడింది, పరిపాలనా యంత్రాంగం ప్రభుత్వ దిశకు ఎంతవరకు అనుగుణంగా నడిచింది, మంత్రివర్గం–అధికార యంత్రాంగం మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి.
రాజకీయ వాతావరణం ప్రభుత్వం పనితీరుకు ఎలా ప్రభావం చూపింది అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రజా చర్చల కేంద్రంగా మారాయి. వాస్తవానికి 2023 డిసెంబర్లో తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించగా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆశలు–ఆకాంక్షల తుఫానులో అధికార బాధ్యతలు చేపట్టింది. పది ఏళ్ల తర్వాత మారిన పాలన తీరు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ, అమలు చేయవలసిన హామీల భారంతో మొదటి రోజే ప్రభుత్వం తన వేగాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సేవలను అమలు చేయడం ప్రజల్లో విస్తృత స్పందనను తెచ్చింది. ఒకేసారి మహిళా భద్రత, ఆర్థిక స్వయం శక్తి, వృత్తి–విద్యావకాశాలపై ఈ పథకం ప్రభావం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.
రాబోయే నెలల్లో ఈ పథకాన్ని మరింత మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం ప్రకటించినా, రవాణా సంస్థలపై పెరిగిన ఆర్థిక భారం బడ్జెట్పై ఒత్తిడిని ఉంచింది. ఇదే సమయంలో ఆరోగ్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం వలన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని ప్రజా వర్గాలు అనుకున్నా, కార్పొరేట్ హాస్పిటళ్ల వాటా పెరిగి ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి వేగం తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కొరత, పరికరాల నిర్వహణ సమస్యలు, దూర ప్రాంతాల్లో వైద్య సేవల లోపం ఇంకా సవాలుగా మిగిలాయి.

రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీని అమలు చేస్తామని పునరుద్ఘాటించి, దశలవారీగా చర్యలు ప్రారంభించినా, మొత్తం రుణభారం, వడ్డీ పెరుగుదల, మార్కెట్ ధరల్లో అనిశ్చితి, ఇనుమడించిన వర్షాభావం వంటి అంశాలు రైతు సంక్షోభాన్ని పూర్తిగా తగ్గించలేదు. కొనుగోలు కేంద్రాల వద్ద గందరగోళం, చెల్లింపుల ఆలస్యం, ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే విధానాలపై ప్రభుత్వం–రైతుల మధ్య పలు సందర్భాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యా రంగంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పలు పాలనా నిర్ణయాలు ఆలస్యం కావడం, ఫీజు రీయింబర్స్మెంట్లో వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడం, ప్రైవేట్ కాలేజీల్లో అకాడమిక్ కార్యకలాపాల నిలుపు, విద్యార్థుల నిరసనలు—విద్యా వాతావరణాన్ని అస్థిరం చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత, మౌలిక వసతుల ఆలస్యం, ఉన్నత విద్యాసంస్థల్లో ఉద్యోగాల స్తోమత లేకపోవడం వల్ల యువతలో నిరాశ పెరిగింది.
ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పలు నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ, గ్రూప్ పరీక్షల పునరావృత సమస్యలు, ప్రశ్నాపత్రాల లీకులు, కోర్టు కేసులు, ఎంపిక ప్రక్రియల ఆలస్యం వల్ల నిరుద్యోగ యువతలో అసంతృప్తి మరింత గాఢమైంది. నిరుద్యోగ భృతిపై ఎన్నికల హామీ ఇప్పటికీ అమలు దిశలో స్పష్టతను సాధించక పోవడం కూడా ప్రభుత్వంపై విమర్శలకు కారణమైంది. ఆర్ధిక రంగంలో పూర్వ ప్రభుత్వపు భారీ అప్పులు, పెద్ద ప్రాజెక్టుల నిర్వహణ భారం, కొత్త సంక్షేమ పథకాల ఖర్చులు, కౌలు రైతులకు మద్దతు చర్యలు— రాష్ట్రానికి భారంగా మారాయి. ఆదాయ వనరులు పెంచడంలో ప్రభుత్వం కలిగి ఉన్న ప్రణాళికలు స్పష్టంగా ప్రకటించక పోవడం వల్ల ఆర్థిక స్థితిపై ప్రతిపక్ష విమర్శలు ఉధృతమయ్యాయి.
పాలనా వ్యవస్థలో అధికారులు–మంత్రుల మధ్య సమన్వయం లోపించడం, ఫైళ్ల నిల్వ, అనేక విభాగాల్లో నిర్ణయాల ఆలస్యం, అకస్మాత్తుగా తీసుకునే ప్రకటనలు, అమలులో కనబడే వ్యవస్థ లోపాలు ప్రభుత్వంపై ప్రత్యేక దృష్టి ఆకర్షించాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం పదేపదే స్పందించినా, వివిధ శాఖల్లో నియామకాలు–టెండర్లపై వస్తున్న విమర్శలు అధికార ప్రతిష్ఠను దెబ్బతీసాయి. భద్రతా వ్యవస్థ, శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు నిష్పక్షపాత ధోరణిని కోల్పోయారని ప్రతిపక్షం తరచూ విమర్శించింది. మత–జాతి ఆధారిత ఉద్రిక్తతలు పెరిగాయని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. పట్టణాభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ, నీటి సరఫరా, మురుగు వ్యవస్థల సంస్కరణలపై దిశా నిర్దేశం లేకపోవడం కూడా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలను ఇబ్బందుల్లో ఉంచింది.
అదే సమయంలో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రశంసలు పొందాయి. పల్లె–పట్టణాల్లో అభివృద్ధి పనులకు అనేక నిధులు కేటాయించడం, పాడి–పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసే చర్యలు, డిజిటల్ సేవల విస్తరణ, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక యూనివర్సిటీలు వంటి నిర్ణయాలు ప్రభుత్వానికి పాజిటివ్గా మారాయి. ముఖ్యంగా సంక్షేమం–అభివృద్ధి అనే ద్వంద్వ ధోరణిలో ప్రభుత్వం తన గుర్తింపును నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు కనిపించాయి.
మొత్తంగా రెండు సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టమైన విజయాలు, ప్రాముఖ్యమైన లోపాలు రెండూ కలిసిన మిశ్రమ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు దశకు చేరక పోవడం వల్ల ప్రజలలో ఆశావహ భావనతో పాటు ఆందోళన కూడా పెరిగింది. పరిపాలనా శైలి, ఆర్థిక నిర్వహణ, వ్యవసాయ–విద్యా–ఉద్యోగ వ్యవస్థల సంస్కరణ, నగరాభివృద్ధి—ఇవన్నీ రాబోయే సంవత్సరంలో ఈ ప్రభుత్వానికి ప్రధాన పరీక్షలు. ప్రజల అంచనాలు మరింత పెరిగిన తరుణంలో ప్రభుత్వం తన పనితీరును బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అత్యవసరమైంది. రెండేళ్ల పాలన రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసినా, ఆ దిశలో సుస్థిరమైన అడుగులు వేయాల్సిన బాధ్యత మాత్రం ఇప్పుడు మరింత భారంగా అధికారంపై నిలిచింది.
రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…9440595494





