- కొత్తగా ఆదిలాబాద్కు గ్రీన్ సిగ్నల్,
- భూ సేకరణలో మామునూరు ఆలస్యం
( మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
రాష్ట్రంలో త్వరలో మరో రెండు విమానాశ్రయాలు సిద్దం కానున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం తప్ప ఆకాశయానానికి తెలంగాణ ప్రజలకు మరో అవకాశంలేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో అనేకసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు క్రమంలో జరిగిన ఒప్పందం కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు తీవ్ర అవరోధంగా మారింది. ఎట్టకేలకు ఆ నిబంధనలను తొలగించుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రమ ఫలించింది. ఫలితంగా ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఎప్పుడో 1930 లో నాటి నిజాం ప్రభువు ఏర్పాటు చేసిన ఈ విమానశ్రయ పునరుద్దరణకు ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా (ఎఎఐ) కొద్ది రోజుల క్రితం అంగీకరించింది. అయితే మరో 253 ఎకరాల భూమిని సేకరించే విషయంలో కొంతకాలంగా జిల్లా అధికార యంత్రాంగానికి స్థానిక రైతులకు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఎయిర్పోర్టు నిర్మాణంలో కొంత ఆలస్యం జరుగుతున్నది.
అందుబాటులో ప్రభుత్వ స్థలం ఉండడంతో తమకు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. కాని పక్షంలో ప్రస్తుతం మార్కెట్లోఉన్న ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలంటూ వారు భీష్మించుకుని కూర్చోవడం ఆలస్యానికి కారణంగా మారింది. ఇప్పటికే ఎయిర్పోర్టుకు 697 ఎకరాల సొంత భూమి ఉంది. రన్వే ఇతర అవసరాలకు మరో 253 ఎకరాలు అవసరమని ఎయిర్పోర్టు అథార్టి చెప్పడంతో భూ సేకరణ అనివార్యమైంది. సమీపంలోని నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరు పల్లి గ్రామాలకు చెందిన రైతుల నుండి భూమిని సేకరించే క్రమంలో వారికి అందించే నష్టపరిహారం విషయంలో అనేక దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎయిర్పోర్టు వొస్తే తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతున్నదన్న విషయాన్ని అంగీకరిస్తూనే, విలువైన తమ భూములను చౌకగా ఇవ్వడానికి మాత్రం వారు అంగీకరించడం లేదు.
తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించిన ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కూడా భూ సేకరణ జరుపాల్సి ఉంది. మామునూర్లో మాదిరిగానే ఆదిలాబాద్ విమానాశ్రయంలో నిజామ్ కాలంలోనే విమాన రాకపోకలు సాగించేవి. ముఖ్యంగా ఆనాటి మిలటరీ అవసరాలకు ఈ విమానాశ్రయం ఎక్కువగా ఉపయోగపడింది. మిలటరీ విమానాలకు ఇంధనం నింపే ప్రక్రియ సాగేది. మామునూరు లాగా ఇది కూడా స్వాతంత్ర్యానంతరం భారత విమాన సర్వీసు అధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత కొంతకాలం పైలెట్ శిక్షణకు దీన్ని వినియోగించారు. దీని పునరుద్ధరణ కోసం స్థానిక ప్రజలు, నాయకులు కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేశారు. 2019లో నాటి బిఆర్ఎస్ సర్కార్ ఎయిర్ ఫోర్స్ అథార్టీకి కావాల్సిన 1592 ఎకరాల భూ సేకరణకు అనుకూల చర్యలు చేపట్టినప్పటికీ కేంద్రం నుండి పెద్దగా స్పందన కనబడలేదు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన తర్వాత కేంద్రానికి చేసిన అనేక విజ్ఞప్తుల మేరకు ఎఎఐ నుండి అనుకూల స్పందన వొచ్చింది. ముందుగా మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, కొద్ది నెలల్లోనే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతించడం నిజంగా తెలంగాణ ప్రజలు ఆనందించాల్సిన విషయం. ఆరు నెల కాలంలోనే ఈ రెండు విమానాశ్రయాల పునరుద్దరణకు కేంద్రం అంగీకరించడాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
ముఖ్యంగా తమ ప్రభుత్వ కాలంలో రెండు ఎయిర్పోర్టులను 15 నెలల కాలంలోనే సాధించుకున్నందుకు గర్వపడుతున్నామన్నారాయన. కాగా, హైదరాబాద్ తర్వాత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న వరంగల్ ఇప్పటికే వాణిజ్య, విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో ముందువరుసలో నిలుస్తున్నది. రాష్ట్రానికి రెండవ రాజధానిగా తీర్చిదిద్దాలనుకుంటున్న తరుణంలో మామునూరు లో పునరుద్దరించనున్న విమాన సర్వీసు వల్ల దేశ విదేశీ పెట్టుబడులు రావడానికి దోహదపడుతుందనుకుంటున్నారు. అలాగే ఎక్కడో మారుమూల ప్రాంతంగా ఉంటున్న ఆదిలాబాద్కు విమానాశ్రయం రాకతో ఆ జిల్లా ముఖచి త్రమే మారే అవకాశముంది.
ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలుపుతూ వెళ్ళే 44వ జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఆదిలాబాద్ హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మహారాష్ట్రలోని నాగపూర్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కావల్సినంత మానవ వనరులు, ఖనిజ సంపద ఇక్కడ ఉంది. సమీపంలోని నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు ఇప్పటికే వ్యాపార, వాణిజ్య రంగాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆదిలాబాద్లో భారీపరిశ్రమలను నెలకొల్పేందుకు పారిశ్రామికులు ఉత్సాహం చూపించే అవకాశముంది. అలాగే ఇక్కడ పౌర విమానయానంతో పాటు జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్గా దీన్ని అభివృద్ది పర్చాలన్న ఆలోచన ఉంది. అంటే వాయుసేన శిక్షణా కేంద్రంగా కూడా దీన్ని వినియోగించుకోనుండడంతో ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం లేకపోలేదు




