“మొదటి సారిగా ఉద్యమ అనుభవం (పీవీ కే కాదు, ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి కూడా) 1939 వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ లో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. ఒకటి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నూతన భవనం (ప్రస్తుత భవనం) ఆవిష్కరింపబడింది. ఈ భవనమే విద్యార్ఠుల ఉద్యమాలకు పురిటి గడ్డగా పేర్గాంచింది.”
(పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి బాల్య విశేషాల గురించి మరొక్కసారి)
స్కూల్ రోజుల్లో భావోద్వేగం ఉప్పొంగి పీవీ రాసిన కవితలు రక రకాలు. ఆయన ద్విపదలు, గీతాలు, వృత్తాలు రాసాడు. అంటే ఆయనది ఒకే మూసలో వెలిబుచ్చే కవిత్వం కాదు. ఆ చిన్నతనపు రచనలు చక్కటి భావనా శక్తి, కల్పనా వైవిధ్యం, కళాత్మక దృష్టి కలిగి వుండేవట. కవిత్వాలల్లడం, కథలు, నాటకాలు వ్రాయడంతో మొదలైంది ఆయన రచనా ప్రక్రియ. జయచంద్రునిపై “జయ చంద్రా- హైందవ ధ్వంసకా” ఆనే మకుటంతో ఆయన రాసిన పద్యాలు ఆ రోజుల్లో భజన మండలి సభలల్లో విరివిగా ప్రచారం పొందాయట. పీవీ తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా పద్య – గద్య రచనలు చేశాడట. ఈ రచనా వ్యాసంగం పీవీకి ఒక అలవాటుగా తయారై రాబోయే కాలేజీ రోజుల్లో, ఆ తర్వాత వివిధ రకాల జీవన విధానాల్లో (లాయరుగా, పత్రికా నిర్వాహకుడిగా, ఎం ఎల్ ఏగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎంపీ గా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా) ‘నిత్య పఠనం – అనునిత్య రచనం‘ అనే విధంగా చదవడం, రాయడం ఆయనలో అంతర్లీనమయ్యాయి. ఒకానొక బాల వాఙ్మయ పోటీకి పీవీ రెండు షేక్స్ పియర్ సుఖాంతక, రెండు విషాదాంతక కథా సంగ్రహాలను పంపించినట్టు, అయితే ఆ పోటీ ఫలితం వెలువడనే లేదనీ; అదేవిధంగా ఒకటో, రెండో హిందీ సినిమా కథలు వ్రాసి పంపించాడనీ వాటి అతీ గతీ కనిపించలేదని తెలిసింది. ఈ ఆశాభంగాలను పీవీ సీరియస్ గా తీసుకోలేదనీ, అతని ఉద్దేశం రాయడమనీ, ఆ పై ఏమి జరిగిందో అన్న తాపత్రయం వుండేది కాదనీ కూడా తెలిసింది.
మొత్తానికి ఆ బాల్యదశ లోనే పీవీ కళారంగపు అన్ని పార్శ్వాలని తట్టాడు. అలనాటి నరసింహుడి భక్తుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడే ‘చదువుల లోని మర్మమెల్ల చదివితి తండ్రీ!” అన్నాడట. కాని ఇక్కడ యీ నరసింహుడు స్కూల్ చదువులప్పుడే “బాల్య జీవన కళా మధురిమలన్నీ చవి జూచితి చదువరీ!“ అని మనకు తెలుపుతున్నాడు. మొదటి సారిగా ఉద్యమ అనుభవం (పీవీ కే కాదు, ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి కూడా) 1939 వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ లో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. ఒకటి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నూతన భవనం (ప్రస్తుత భవనం) ఆవిష్కరింపబడింది. ఈ భవనమే విద్యార్ఠుల ఉద్యమాలకు పురిటి గడ్డగా పేర్గాంచింది. ఐతే ఈ నూతన ఆర్ట్స్ కాలేజీ భవనం ఆరంభం కాకముందే ఆ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు గన్ ఫౌండ్రీ లోని తాత్కాలిక భవనంలో తమ తరగతులు నిర్వహిస్తున్నప్పుడే 1938-39లో ఒక ఉద్యమాన్ని నిర్వహించారు. అంటే ఆ నూతన భవన పుట్టుకే (అంటే ఆరంభమే) ఉద్యమాల పుట్టుక అయిందేమో? ఇది రెండవ విశేషం. ఈ ఉద్యమమే “వందే మాతరం ఉద్యమం” గా పేర్గాంచింది.
తరగతులు జరుగుతున్న అప్పటి తాత్కాలిక ఉస్మానియా యూనివర్సిటీ కేంపస్ లో కొంత మంది విద్యార్థులు కాలేజీ ప్రార్థన సమయంలో “వందే మాతరం” దేశ భక్తి గీతాన్ని పాడేవారట. ఆ విషయం అధికారుల దృష్టికి రాగానే కేంపస్ లో ‘వందే మాతరం’ గీతాన్ని పాడటాన్ని నిషేధిస్తూ 28 నవంబర్, 1938 నాడు ఉత్తరువులు జారీ చేశాడు నిజాం నవాబ్. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ఉద్యమించారు. వీరికి సంఘీభావం ప్రకటిస్తూ అలనాటి నిజాం రాష్ట్ర ఇతర ప్రాంత (వరంగల్, గుల్బర్గా, ఔరంగాబాద్) విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఉద్యమించారు. ఉద్యమించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ఠులతో (350 మంది) బాటు ఇతర ప్రాంత విద్యార్థులను కూడా పాఠశాలల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విధంగా వరంగల్ లో చదువుతున్న 39 మంది విద్యార్థులను కూడా తొలగిస్తే, వారిలో పీవీ, పాములపర్తి సదాశివరావు ప్రభృతులున్నారు.
ఈ విషయం లో అలనాటి ప్రత్యక్ష సాక్షి కాళోజీ గారు ఏమన్నారంటే: “దాదాపు 600 మంది విద్యార్థులు నాగ్ పూర్ యూనివర్సిటీలో చేరారు. ఈ సందర్భం లో ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తరిమివేయబడ్డ విద్యార్థులకు మద్రాసు యూనివర్సిటీవారు గానీ, ఆంధ్రా యూనివర్సిటీవారు గానీ చేర్చుకునే అవకాశం కల్గించలేదు. ‘యూనివర్సిటీని గుర్తించం; కాబట్టి చేర్చుకోం’ అన్నారు. అప్పటి నాగ్ పూర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కేదార్, యూనివర్సిటీ సెనేట్ లో, ఉస్మానియా యూనివర్సిటీని గుర్తింపు చేయించి ఉస్మానియా విద్యార్థులకు అడ్మిషన్ కల్పించినారు. ఆ 600 మంది విద్యార్థుల చదువు ముగించుకున్న తర్వాత నిజాం రాజ్యంలో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొన్న వారు దాదాపు 150 మంది. పీ వీ నరసింహారావు, సదాశివరావు ఆ గుంపునకు చెందిన వారే.” ఈ విధంగా బహిష్కృతులైన విద్యార్థుల్లో చాలా మంది నాగపూర్ యూనివర్సిటీలో చేరారు. వారిలో జూనియర్ ఇంటర్మీడియేట్ చదువుతున్న పీవీ కూడా ఒకరు.
ఉత్తేజ పరచిన నాగపూర్ అనుభవాలు: ఇంటర్మీడియేట్ లో చేరడానికి పిల్లలు తీరా నాగ్ పూర్ చేరేసరికి వీళ్ళకు తరగతులు నిర్వహించడానికి తరగతి గదులు ఖాలీ లేవు, తగు ఉపాధ్యాయులకు ఫ్రీ టైం కూడ లేదు. కాబట్టి అక్కడి విద్యార్థులకు వేసవి సెలవు లిచ్చినప్పుడు వీరికి తరగతులను ప్రారంభింప నిర్ణయించారు, కాబట్టి తరలివచ్చిన కాందిశీక ఉస్మానియా విద్యార్ఠులకు రెండు మూడు నెలలు చదువు కార్యక్రమం లేదు. అసలే తిరగడం, నూతనత్వాన్ని పరిశీలించడమంటే ఎంతో ఆసక్తి వున్న పీవీ కి ఈ వెసులుబాటు వరమే అయింది. మొదటిసారిగా నాగ్ పూర్ చేరిన పీవీకి వింత ప్రపంచం, క్రొత్త వాతావరణం కనబడింది. బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకొనడం ప్రారంభమైన ఆ నూనూగు మీసాల వయస్సులో మొదటి సారిగా చూస్తున్న ఈ నూతన జీవన శైలికీ, తానిప్పటి వరకు మెలిగిన నైజాం రాష్ట్ర ప్రజా జీవనానికీ గల వ్యత్యాసం పీవీ ని అబ్బుర పరచడమే కాకుండా ఆయనలో ఆలోచనా శక్తిని ఇనుమడింప జేసింది. అక్కడి స్వేచ్చా వాతావరణాన్ని – ముఖ్యంగా బురఖా లేని స్త్రీలు వీధుల్లో తిరగడం, విద్యార్థినులు సైకిళ్ళ పైన కాలేజీలకు రావడం, విద్యార్థులతో సమంగా ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చూసి ఆనందించాడు. ఛత్రపతి శివాజీ, బాలగంగాధర తిలక్ లపట్ల ప్రజలకున్న అభిమానాన్ని, హిందూ మత సంస్కృతి, ఆచార వ్యవహారాల పై వున్న ఆదరణను గాంచాడు.
వైవిధ్యంతో కూడిన ఈ క్రొత్త స్వేచ్చాయుత వాతావరణంతో పీవీ ఎంతో ఉత్తేజం పొందాడు. ఆ కౌమార ప్రాయ పీవీ జాతీయ విలోకనలో విస్తృతి పెరిగింది. ఆ నూతన సమాజాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మరాఠీ భాషను నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మరాఠీ నాటకాలను, సినిమాలను పరిశీలనాత్మకంగా చూచేవాడు. అసలే మంచి సినిమాలపై మక్కువ గల పీవీ అక్కడి మరాఠీ సినిమాలను చూసి వాటి స్థాయి తెలుగు సినిమాల కంటే ఎంతో ఆధిక్యమని గ్రహించాడు. అక్కడి నటీనటులను అభిమానించాడు. ‘ప్రహ్లాద్ కేషవ్ ఆత్రే’ అనే గొప్ప రచయిత అలనాటి నాటకాలలో, సినిమాలలో తన రచనల ద్వారా గుప్పించిన హాస్యం పీవీ కి అమితంగా నచ్చింది. తరవాత మనం పీవీ లో గాంచిన హాస్య సంభాషణా చాతుర్యం ఆత్రే ద్వారా సంక్రమించిందేమో? ఇదే సమయంలో “ యూ కాంట్ టేక్ ఇట్ విత్ యు “ అనే హాస్యంతో కూడిన ఒక ప్రసిద్ధ ఆంగ్ల శృంగార చిత్రాన్ని చూసి ఆంగ్ల చిత్రాల పట్ల మక్కువ పెంచుకున్నాడు. ఈ చిత్ర దర్శకుడిని మెచ్చుకునేవాడు. (ఈ సినిమా 1938 లో ఉత్తమ చిత్రం, దర్శకుడు ఫ్రాంక్ కాప్రా ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డులు పొందటం జరిగింది) మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే పీవీకి కుస్తీ పోటీలంటే కూడా ఇష్టమేనని నాగపూర్ మనకు తెలుపుతుంది.
(మిగతా రేపటి సంచికలో )
-పాములపర్తి నిరంజన్ రావు
పిన్నా శివకుమార్